సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): జామ్తారా సైబర్ నేరగాళ్లు మళ్లీ రెచ్చిపోతున్నారు. ఆరు నెలలుగా అక్కడి నుంచి వస్తున్న సైబర్ నేరాలకు సంబంధించిన కాల్స్ పెరిగాయి. దీంతో పోలీసులు మళ్లీ నిఘా పెంచారు. నేరగాళ్లపై చర్యలకు మరోసారి సిద్ధమయ్యారు. గతంలో సైబర్ నేరగాళ్లను గుర్తించిన పోలీసులు వారిపై సుమోటో కింద కేసులు నమోదు చేశారు. దీంతో సైబర్ నేరగాళ్లలో భయం పుట్టి నేరాలు తగ్గాయి. గడిచిన ఆరునెలలుగా పోలీసులు కూడా అంతగా పట్టించుకోలేదు. దీంతో ఇంత కాలం సైబర్ నేరాలకు దూరంగా నేరగాళ్లు తిరిగి మొదలుపెట్టారు. ఈ నేరగాళ్లు ఓటీపీ, ఎలక్ట్రిసిటీ బిల్స్, కేవైసీ అప్డేట్, బ్యాంకు అధికారులమంటూ ఫోన్లు చేసి మోసాలకు పాల్పడుతుంటారు. ఆర్థిక పరమైన నేరాల్లో సైబర్ క్రైమ్ ఠాణాకు వచ్చే ఫిర్యాదుల్లో సగానికి పైగా ఇలాంటి నేరాలే ఉంటాయి. ఒక్కో ఘటనలో నేరగాళ్లు రూ.లక్ష నుంచి రెండు లక్షల వరకు దోచుకుంటున్నారు.
ముఠాలుగా విడిపోయి..
జార్ఖండ్లోని జామ్తారా జిల్లాలోని చాలా ప్రాంతాలు సైబర్ నేరాలకు అడ్డాలుగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ నుంచి సిమ్ కార్డులు కొనుగోలు చేసి, ఈశాన్య రాష్ర్టాలకు చెందిన బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించి మోసాలు చేస్తుంటారు. ఇక్కడున్న ప్రధాన సైబర్ నేరగాళ్లు ముఠాలను తయారు చేస్తుంటారు. ఒక్కో ముఠా తన కార్యకలాపాలను ఒకో చోట నుంచి నిర్వహిస్తుంటుంది. ఫోన్లు చేసి మోసం చేసేది ఒకరైతే, వాటికి సంబంధించిన ఖాతాలు, సిమ్కార్డులు సమకూర్చేది మరొకరు. బ్యాంకు ఖాతాల్లో బాధితులు జమ చేసిన డబ్బును డ్రా చేసేది మరోముఠా. ఈ ముఠాలన్నింటిని గ్యాంగ్ లీడర్లు సమన్వయం చేస్తుంటారు. కొన్ని గ్రామాలు గ్రామాలే ఈ సైబర్ నేరగాళ్ల అడ్డాలుగా మారాయి.
పెరుగుతున్న నేరాలు..
సైబర్ నేరాలు గత ఆరు నెలలుగా పెరిగిపోతున్నాయి. ఒక రాష్ట్రంలో ఉన్న వారు మరో రాష్ర్టాలోని ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ నేరాలను అరికట్టేందుకు చర్యలు మొదలయ్యాయి. ఆయా రాష్ర్టాల సైబర్క్రైమ్ పోలీసులను సమన్వయం చేసుకునేందుకు సోషల్ మీడియా గ్రూప్లు, ఆన్లైన్ మీటింగ్లను పోలీసులు ఏర్పాటు చేశారు. రెండేండ్ల కిందటే ఇలాంటి కార్యక్రమాలకు నాంది పలికారు. నేరగాళ్లకు చెక్ పెట్టే విషయంలో కేంద్రం నుంచి కూడా సహకారం ఉన్నది. ఒక నిందితుడు పట్టుబడ్డాడంటే.. అతడు ఎక్కడెక్కడ ఎన్ని సిమ్ కార్డ్స్ వాడాడు.. ఎన్ని నేరాలు చేశాడు.. వంటి సంబంధిత అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిఘాను మరింత పటిష్టం చేసి, ముందుకు వెళ్తున్నారు.