సిటీబ్యూరో, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ)/ ఎల్బీనగర్: నాగోల్లో కాల్పులు జరిపి బంగారం దోచుకుపోయిన కేసును ఛేదించేందుకు 15 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. నిందితుల కోసం రాచకొండ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా 800 సీసీ కెమెరాలను విశ్లేషించారు. దోపిడీ తర్వాత దొంగలు నిమిషాల వ్యవధిలోనే నాగోల్ మీదుగా ఉప్పల్ వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దొంగిలించిన బైక్లపైనే వచ్చిన దుండగులు.. ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. దుండగులు తొలుత రెక్కీ నిర్వహించి, సీసీ కెమెరాలు, వీధి లైట్లు సరిగా లేని మార్గాలను ఎంచుకొని పారిపోయినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
దొంగలను పట్టుకునేందుకు సాంకేతిక పరమైన అంశాలతోపాటు పాత నేరస్తుల చిట్టాను పరిశీలిస్తున్నారు. ఆ దిశగానే ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. యూపీ, రాజస్థాన్, హర్యానాకు చెందిన గ్యాంగ్లే ఈ దోపిడీకి పాల్పడి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కాల్పుల్లో గాయపడిన దుకాణం యజమాని కళ్యాణ్ చౌదరి, సుఖ్దేవ్ల ఆరోగ్య పరిస్థితి నిలుకడగానే ఉన్నదని, ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. నాగోల్లోని సుప్రజా దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితులను పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ శుక్రవారం ఉదయం పరామర్శించారు. చైతన్యపురి పోలీస్స్టేషన్ పరిధి స్నేహపురి కాలనీలో మహాదేవ్ జువెలర్స్ యజమానితో పాటు మరొకరిపై గురువారం రాత్రి 9.15 గంటల ప్రాంతంలో తుపాకీతో కాల్పులు జరిపి, సుమారు మూడు కిలోల బంగారం, రూ. 1.75 లక్షల నగదు దోచుకున్న దుండగులు బైక్లపై పారిపోయిన విషయం తెలిసిందే.
పక్కాగా రెక్కీ నిర్వహించి..
దుండగులను పట్టుకునేందుకు 15 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. సికింద్రాబాద్లోని గణపతి జువెలర్స్ షాప్ యజమానిని టార్గెట్ చేసుకొని ఈ దోపిడీ జరిగినట్లు తెలుస్తుందన్నారు. 2018లో కీసర పోలీస్స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటనే జరిగిందని, ఆ ఘటనలో యూపీకి చెందిన గ్యాంగ్ను అరెస్టు చేశామని గుర్తు చేశారు. వారు ప్రస్తుతం జైల్లో ఉన్నారని తెలిపారు. ఈ గ్యాంగ్కు సంబంధించిన వారెవరైనా యూపీ నుంచి వచ్చి ఈ ఘటనకు పాల్పడ్డారా.? అనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. రాజ్కుమార్, సుఖ్దేవ్ ప్రతి గురువారం సికింద్రాబాద్ నుంచి బంగారం తీసుకొచ్చి.. వివిధ దుకాణాలకు సరఫరా చేస్తుంటారని తెలిపారు. ఇందులో భాగంగానే దోపిడీ దొంగలు పక్కాగా రెక్కీ నిర్వహించి, ఆ ఇద్దరిని వెంబడించి ఈ ఘటనకు పాల్పడ్డారని చెప్పారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ఎవరికైనా సమాచారం తెలిస్తే డయల్ 100కు, తన వాట్సాప్కు సమాచారం ఇవ్వాలని, తగిన రివార్డును ఇస్తామని ప్రకటించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి బాగుందని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.