నిరుద్యోగ యువత ప్రైవేట్ రంగంలో ఉచిత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఛత్రినాక ఇన్స్పెక్టర్ సయ్యద్ ఖాదర్ జిలానీ అన్నారు. ఆయన నమస్తే తెలంగాణతో గురువారం మాట్లాడుతూ, నగర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత కోసం జాబ్మేళా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా బస్తీల్లో సంచార వాహనం ద్వారా నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందన్నారు. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకున్న యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఫలక్నుమా ఏసీపీ పరిధిలో ఇప్పటి వరకు దరఖాస్తులను స్వీకరించారన్నారు.
పలు కంపెనీలు ఇంటర్వూలు చేయనున్నాయని, ఆయా విద్యార్థి విద్యార్హతతో పాటు నైపుణ్యత ఆధారంగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. మొత్తం 15 కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ముందుకు వస్తున్నాయన్నారు. మొత్తం 2500 ఉద్యోగాలు ఇచ్చేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ నెల 17న శనివారం ఫలక్నుమా జూనియర్ కళాశాల ఆవరణ (భరత్కోట)లో ఉదయం 9 గంటల నుంచి జాబ్మేళా ప్రారంభం అవుతున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన యువకులు పూర్తి సర్టిఫికెట్లతో సంప్రదించి ఉద్యోగ అవకాశం పొందాలని ఇన్స్పెక్టర్ సయ్యద్ ఖాదర్ జిలానీ స్పష్టం చేశారు.