సిటీబ్యూరో, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేసి, డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడానికి కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలు సమన్వయంగా పనిచేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. శుక్రవారం బంజారాహిల్స్లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీఎస్ఐపీసీసీ)లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ), డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ), ఎక్సైజ్, ఎఫ్ఆర్ఆర్ఓ, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, కౌంటర్ ఇంటెలిజెన్స్, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసులతో సీపీ సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. దేశంలోకి డ్రగ్స్ రాకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నదని, అందుకు ఏకీకృత కార్యాచరణ, సమాచార మార్పిడి, టెక్నాలజీ , అన్ని శాఖల మధ్య సమన్వయం అవసరమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్పై యుద్ధం చేస్తున్నదని, డ్రగ్స్కు అలవాటు పడి ప్రమాదకరమైన పరిస్థితిని పౌరులు తెచ్చుకుంటున్నారని, అలాంటి పరిస్థితి నుంచి పౌరులను రక్షించడానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. అందుకు హైదరాబాద్లో హెచ్న్యూ (హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్)ను ఏర్పాటు చేసి డ్రగ్స్లో డిమాండ్, సైప్లె చైన్ను తెంపేస్తున్నామన్నారు. డ్రగ్స్కు అలవాటు పడ్డ వారిలో మార్పు తీసుకొచ్చి పునరావాస చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ.. డ్రగ్స్ అక్రమ రవాణాకు సంబంధించిన మార్గాలను, వాటిని ఎలా ఎదుర్కోవాలనే విషయాలపై చర్చించారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీ సాయి చైతన్య మాట్లాడుతూ.. సాంకేతికంగా ఎప్పటికప్పుడు డాటాను పరిశీలిస్తున్నామన్నారు. డీఆర్ఐ అదనపు డైరెక్టర్ కె.వినయ్కుమార్ మాట్లాడుతూ.. దేశంలోకి ప్రవేశించే అన్ని మార్గాలపై నిఘా ఉన్నదన్నారు. ఈ సమావేశంలో జాయింట్ సీపీ గజారావు భూపాల్, హెచ్న్యూ డీసీపీ చక్రవర్తి గుమ్మి, ఎన్సీబీ హైదరాబాద్ నుంచి సుమిత్ ఆర్య, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారి సరళ, ఎఫ్ఆర్ఆర్ఓ నుంచి భాగ్యలక్ష్మి, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ నుంచి ఖురేషి, తదితర అధికారులు పాల్గొన్నారు.