ఉద్యోగాల కోసం దరఖాస్తు చేశామని, వాటి సంబంధిత లేఖలు పార్సిల్ రూపంలో వస్తాయని కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకు చెబుతుంటారు. వాటిని ఒకసారి తెరిచి, అందులో ఏముందో చెక్ చేయండి. అందరినీ అనుమానించలేం. అత్యంత రహస్యంగా డార్క్ వెబ్లో డ్రగ్స్ క్రయవిక్రయాలు జరుగుతు న్నాయి. అవి పార్సిళ్లు, కొరియర్ల రూపంలో ఇంటికి చేరుతాయి. అందుకే ఆ ఎన్వలప్లో ఏముందో తెరిచి చూస్తే చాలా మంచిది. పిల్లలను ఓ కంట కనిపెట్టాలి. వాళ్లు చెడు వ్యసనాలకు బానిస కాకుండా చూడడం మనందరి బాధ్యత. ఈ క్రమంలో కొరియర్ సంస్థలతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తాం.
– హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్
హైదరాబాద్లో డ్రగ్స్ సరఫరాను నిర్మూలించే దిశగా నగర యువత, తల్లిదండ్రులు సహకరించాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ విజ్ఞప్తి చేశారు. నగరానికి చెందిన కొందరు డార్క్నెట్లో డ్రగ్స్ ఆర్డర్ చేసి ఇంటికే తెప్పించుకుంటున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తతతో వ్యవహరించాలని విన్నవించారు. తెలంగాణలో డ్రగ్స్ను ఉక్కుపాదంతో అణిచివేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన దిశానిర్దేశం మేరకు మాదకద్రవ్యాల నెట్వర్క్ను ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. డ్రగ్స్ సరఫరా దారుల్లో ఇప్పటికే వణుకు పుట్టించామని విక్రేతలను మాత్రం వదిలే ప్రసక్తే లేదని సీవీ ఆనంద్ చెప్పారు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ): డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా నగర పోలీసు విభాగంలో ఇటీవల ఏర్పాటైన హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్న్యూ) మాదక ద్రవ్యాల సరఫరాదారుల్లో దడపుట్టిస్తున్నది. డ్రగ్స్ ఏరివేతే పనిగా అహర్నిశలు శ్రమిస్తున్న ప్రత్యేక విభాగం అంతర్రాష్ట్ర ముఠాలను ఛేదించి కేసులు పెట్టి జైల్లో పెడుతున్నది. డ్రగ్స్ సరఫరా చేసేవారు హైదరాబాద్కు పోతే..జైలుకెళ్లడం ఖాయమని గోవా డ్రగ్స్ సర్కిల్ చర్చించుకుంటున్నదని ఇటీవల పట్టుబడిన పెడ్లర్స్ సిటీ పోలీసులకు వెళ్లడించడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్కు తాము డ్రగ్స్ తెచ్చివ్వలేమని కావాల్సిన వారు గమ వద్దకే రావాలంటూ పెడ్లర్స్ సూచిస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్కు విక్రేతలు ఎక్కడున్నా..ఏ రాష్ట్రంలో దాక్కుని ఉన్నా పట్టుకొని చట్టప్రకారం కేసులు నమోదు చేసి జైల్లో పెడతామని సీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు.
నెట్వర్క్ను గుర్తించి ధ్వంసం
చాపకింద నీరులా విస్తరిస్తున్న డ్రగ్స్ నెట్వర్క్ను ముందుగా నగరంలో, తర్వాత జిల్లాలు, అంతర్రాష్ట్రాల వారీగా గుర్తించి ధ్వంసం చేశారు. విదేశీయులు నగరంలో తిష్టవేసి డ్రగ్స్ దందా చేస్తుండటంతో ఐదుగురిని డిపొర్టేషన్ చేశామని, ఇప్పుడు డార్క్నెట్, క్రిప్టోకరెన్సీలపై నిఘా పెట్టామని సీపీ ఆనంద్ తెలిపారు. హెచ్న్యూ ప్రారంభమైనప్పటి నుంచి 58 కేసులు నమోదు చేయగా, 285 మందిని అరెస్ట్ చేశామన్నారు. ఎన్డీపీఎస్ యాక్టులో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన వారిలో 200మంది మొదటి సారి, 125 మంది రెండవసారి, 73మంది 3వ సారి, 38మంది 4వ సారి, 21 మంది 5వ సారి కౌన్సెలింగ్కు హాజరయ్యారని తెలిపారు. డ్రగ్స్ వాడుతూ పట్టుబడే వినియోగదారుల విషయం వారి తల్లిదండ్రులకు వివరిస్తున్నామని, కౌన్సెలింగ్ సమయంలో తల్లిదండ్రులు కూడా హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
విక్రేతల్లో.. విద్యార్థులూ ఉన్నారు
డ్రగ్స్ విక్రేతలను అరెస్టు చేసి పోలీసులు వారిని విచారిస్తున్న నేపథ్యంలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డార్క్నెట్లో డ్రగ్స్కు ఆర్డర్ ఇస్తున్నారని వాటిని పార్సిళ్లు, కొరియర్ల ద్వారా వినియోగదారులకు చేరవేస్తున్నారని తేలింది. డ్రగ్స్కు అలవాటుపడిన వారిలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఆంత్రప్రెన్యూర్స్ కూడా ఉన్నారని విద్యార్థులు ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉండడం ఆందోళనకర విషయమని సీపీ చెప్పారు. డ్రగ్స్ను సరఫరా చేసే ముఠాలు కొత్త కొత్త పద్ధతుల్లో తమ నెట్వర్క్ను విస్తృతపరుచుకుంటున్న నేపథ్యంలో ఇంటికొచ్చే పార్సిళ్లపై తల్లితండ్రులు నిఘా పెట్టాలని సీవీ ఆనంద్ సూచించారు.
ఇంటర్వ్యూలు, ఉద్యోగాల పేరుతో తమకు కొరియర్లు వస్తాయని కొందరు విద్యార్థులు తమ తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నారని వెల్లడించారు. అందరినీ అనుమానించలేమని కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ పిల్లలు డ్రగ్స్కు బానిసలుగా మారవద్దనే ఉద్దేశంలోనే ఈ సూచన చేస్తున్నట్టు స్పష్టం చేశారు. డ్రగ్స్ వాడే వారిపై కేసులు నమోదు చేస్తున్నామని, పిల్లలపై కేసులు నమోదైతే తల్లిదండ్రులు కూడా పోలీస్స్టేషన్కు, కౌన్సెలింగ్ కేంద్రాలకు రావాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ క్రమంలోనే కొరియర్ సంస్థలతో సమావేశం ఏర్పాటు చేసి, స్కానింగ్కు కావాల్సిన తగిన యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తామన్నారు. తాజాగా అరెస్టు అయిన ఆరుగురిలో ముగ్గురు బీబీఏ విద్యార్థులు ఉన్నట్లు పేర్కొన్నారు.