సిటీబ్యూరో, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న నలుగురు సభ్యులు గల ముఠాను గురువారం హైదరాబాద్ సెంట్రల్, సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నకిలీ సర్టిఫికెట్లు, రూ.22 వేల నగదు, ముద్రించేందుకు ఉపయోగించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం బషీర్బాగ్లోని పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెంట్రల్జోన్ డీసీపీ ఎం.రాజేశ్చంద్ర కేసు వివరాలను వెల్లడించారు. నాంపల్లి ప్రాంతానికి చెందిన మహ్మద్ హెతేషముద్దీన్ హుస్సేన్ (47) నాంపల్లిలోనే స్టడీ అఫైర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సంస్థను నిర్వహిస్తున్నాడు. అదే సంస్థలో టోలిచౌకి ప్రాంతానికి చెందిన మహ్మద్ ఖాదర్ (42) కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు.
అంబర్పేటకు చెందిన మహ్మద్ ఇమ్రాన్ (41) స్థానికంగా మీ సేవ కేంద్రం నిర్వహించడంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. మలక్పేటకు చెందిన మహ్మద్ అల్తాఫ్ అహ్మద్ (43) కెరీర్ వింగ్స్ స్టడీ కన్సల్టెన్సీని నిర్వహిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. అల్తాఫ్కు విదేశాల్లో పలు ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్తోపాటు పలు యూనివర్సిటీల ఉద్యోగులతో పరిచయాలు ఉన్నాయి. మహ్మద్ హెతేషముద్దీన్, ఖాదర్, ఇమ్రాన్తో అల్తాఫ్కు పరిచయం ఉన్నది. అల్తాఫ్ ద్వారా విదేశాలకు చదువు, ఉద్యోగాల కోసం వెళ్తున్న వారికి నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయించాలని ఈ ముగ్గురు నిర్ణయించుకున్నారు.
ఈ ముగ్గురు కలిసి అల్తాఫ్కు తమ ప్లాన్ను వివరించారు. అల్తాఫ్ అంగీకరించాడు. విదేశాలకు చదువు లేదా ఉద్యోగానికి వెళ్లేవారు ఈ ముఠాను సంప్రదిస్తే వారికి కావాల్సిన నకిలీ సర్టిఫికెట్లను ముద్రించి విక్రయిస్తున్నారు. ఆ నకిలీ సర్టిఫికెట్లను అసలు సర్టిఫికెట్లుగా నమ్మించేందుకు వివిధ యూనివర్సిటీలు, బోర్డుల పేరుతో నకిలీ వెబ్సైట్లను కూడా నిర్వహిస్తున్నారు. అదనంగా కొంత డబ్బు చెల్లిస్తే ఈ నకిలీ వెబ్సైట్లలో వీరు ముద్రించిన సర్టిఫికెట్లను అప్లోడ్ చేసి, వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత తీసివేస్తున్నారు. ఈ ముఠా ముద్రిస్తున్న నకిలీ సర్టిఫికెట్లను అవసరమున్న వ్యక్తులకు అల్తాఫ్ విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు సౌత్జోన్, సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్తోపాటు నాంపల్లి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు చేశారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. ఈ ముఠా నుంచి వివిధ యూనివర్సిటీల పేరుతో ముద్రించిన నకిలీ సర్టిఫికెట్లు, ముద్రించేందుకు ఉపయోగించిన కలర్ ప్రింటర్లు, కంప్యూటర్లతోపాటు రూ.22వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం నిందితులను నాంపల్లి పోలీసులకు అప్పగించారు.