బెట్టింగ్ రాజాల చిత్రవిచిత్రాలు
పట్టుబడుతున్నప్పుడు వారు చెబుతున్న మాటలతో పోలీసులు పరేషాన్
తాజా ఐపీఎల్లో కంగుతింటున్న బుకీలు
గెలిచినా.. ఓడినా.. కుటుంబాలు పడుతున్నది రోడ్డునే
నిండా ముంచడానికే బుకీలు కుట్ర
25 మంది అరెస్టు.. రూ.5 కోట్లు స్వాధీనం
సిటీబ్యూరో, ఏప్రిల్ 10(నమస్తే తెలంగాణ) : 15వ ఐపీఎల్ సీజన్లో మైదానంలో ఆసక్తికరమైన విచిత్రాలు చోటుచేసుకుంటుంటే.. మ్యాచ్పై బెట్టింగ్లు నిర్వహించే బుకీల పరిస్థితి ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఇటీవల హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు జరిపిన ఆకస్మిక దాడుల్లో పట్టుబడిన బుకీలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. గతంలో ఎంతో కొంత లాభాలు వచ్చినప్పటికీ ఇప్పుడు తాము నష్టపోతున్నామని పోలీసులకు తెలుపగా పోలీసులు కొట్టిపారేశారు. దీంతో బుకీలు ఆన్లైన్లో పందెంరాయుళ్లకు చెల్లిస్తున్న వివరాలను పోలీసులకు చూపడంతో షాక్కు గురయ్యారు. అయితే పలువురు పందెం రాయుళ్లను ప్రశ్నించగా కొద్దిమేర లాభాలు ఉన్నాయని తెలుపడం విశేషం. ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు దాదాపు 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. 20 మ్యాచ్లకు సంబంధించి రూ.5 కోట్ల వరకు స్వాధీనం చేసుకోవడంతో వివిధ బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
గెలిస్తే దావత్.., ఓడితే కొట్లాట
బెట్టింగ్ రాయుళ్లను విచారిస్తున్న పోలీసులకు ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి. బెట్టింగ్లో డబ్బులు గెలిచినప్పుడు ఆ డబ్బుతో నేరుగా ఇంటికి వెళ్లకుండా బార్లు, ఇతర ప్రాంతాలకు వెళ్లి దోస్తులతో పార్టీ చేసుకుంటామని వివరించారు. ఓడిపోతే చికాకుతో ఇంట్లో వారితో గొడవ పడుతున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా పందెం రాయుళ్లు బెట్టింగ్ మోజులో పడి అప్పులు చేసి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
మోసమే తప్పా.. లాభం ఉండదు
తాజాగా ఐపీఎల్ మ్యాచ్ల బెట్టింగ్లపై ఆశావాహులను ఆకట్టుకునేందుకు బుకీలు తమదైన శైలిలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ముందుగా మా దగ్గర డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదని కేవలం రిజిస్టర్ చేసుకుని యూజర్ ఐడీ పొంది లైవ్లో బెట్టింగ్ కడితే సరిపోతుందని సూచిస్తున్నారు. మ్యాచ్ గెలిస్తే మీకు మేము డబ్బులు ఇస్తాం.. ఓడిపోతే మీరు మా ఖాతాల్లో డబ్బులు జమచేయాలని ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. అయితే బెట్టింగ్లో ఎప్పుడూ మోసగాళ్లదే పైచేయి ఉంటుందని తెలియని అమాయకులు వారి వలలో పడి మోసపోతున్నారు. కుటుంబ పెద్దలు నిత్యం పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలని, వారి ఫోన్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.
గతంలో జరిగిన 14 ఐపీఎల్ సీజన్లకు ఇప్పుడు జరుగుతున్న 15వ ఐపీఎల్ సీజన్కు చాలా తేడా కనిపిస్తున్నది. ప్రతి సీజన్లోనూ బెట్టింగ్లు కామన్ అయినప్పటికీ అప్పుడు బుకీల చేతిలో పందెం రాయుళ్లు మోసపోయేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. పందెంరాయుళ్ల చేతిలో బుకీలు బొక్కబోర్ల పడుతున్నారు. నిండా మునుగుతున్నారు. నమ్మశక్య కాకున్నా.. జరుగుతున్న వాస్తవం ఇదే అంటున్నారు బుకీలు. ఇటీవల హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు జరిపిన ఆకస్మిక దాడుల్లో పట్టుబడిన బుకీలు షాకింగ్ నిజాలు తెలిపారు. అయితే ఇదంతా బెట్టింగ్ రాయుళ్లను నిండా ముంచడానికే బుకీల కుట్రగా పోలీసులు భావిస్తున్నారు.