సిటీబ్యూరో, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): ఆపరేషన్ రోప్ అమలు తీరుపై నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు గోషామహల్లోని ట్రాఫిక్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ కాన్ఫరెన్స్ హాల్లో ట్రాఫిక్ విభాగం అధికారులతో నిర్వహించిన సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. ఆయా ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ రద్దీ ఉన్న చోట, సాఫీగా ట్రాఫిక్ వెళ్లేందుకు అవసరమైన నిర్ణయాలను స్థానిక ఎస్హెచ్వోలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్న ప్రాంతాల్లో స్టాప్ లైన్ ముందు వాహనాన్ని ఆపడం, ఫ్రీ లెఫ్ట్ను బ్లాక్ చేయకుండా ఉండటం, రోడ్లపై క్యారేజ్ వేలు ఫ్రీగా ఉండేలా వాహనదారుల్లో మార్పు తీసుకురావాలని పేర్కొన్నారు. ఇందుకు ఒకపక్క అవగాహన, మరోపక్క ఎన్ఫోర్స్మెంట్ నిర్వహించాలని ఆదేశించారు. జంక్షన్ల అభివృద్ధి గూర్చి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. క్యారేజ్ వేలలో వాహనాల పార్కింగ్, ఫుట్పాత్లపై వ్యాపారాలు లేకుండా చూడాలన్నారు.
ఎన్ఫోర్స్మెంట్, అవగాహనతోనే సాధ్యం..
నగర రోడ్లపై వాహనాలు సాఫీగా వెళ్లాలని, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్, అవగాహన కార్యక్రమాల ద్వారా అది సాధ్యమవుతుందని సీపీ తెలిపారు. ట్రాఫిక్ విభాగానికి ప్రజలతో 100 శాతం సంబంధం ఉంటుందని, ట్రాఫిక్ విభాగం పటిష్టంగా పనిచేసినప్పుడే నగర పోలీసులకు మంచి పేరు వస్తుందని అన్నారు. ట్రాఫిక్ అంబ్రిల్లాలు, రద్దీ ప్రాంతాల్లో క్రేన్లు, కమ్యూనికేషన్ సెట్స్.. తదితర అంశాలపై సీపీ చర్చించారు. మీమీ పోలీస్స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు కొత్త ఆలోచనలు ఉంటే వాటిని అమలు చేయాలంటూ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ల ఎస్హెచ్ఓలకు సూచించారు. ఫలితాలు సాధించి ఇతరులకు స్ఫూర్తిగా నిలువాలని పేర్కొన్నారు.
ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్ అమలుకు హ్యాండ్ గైడ్..
ఈ సందర్భంగా ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్ హ్యాండ్ గైడ్ను సీపీ ఆవిష్కరించారు. అంతకు ముందు సీపీ గోషామహల్లోని ట్రాఫిక్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ట్రాఫిక్ విభాగంలో జరుగుతున్న శిక్షణ, ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారికి ఇచ్చే కౌన్సెలింగ్ తరగతులపై సీపీ ఆరా తీశారు. శిక్షణ కేంద్రంలోని తరగతి గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ విభాగంలో చేరనున్న హోంగార్డులను ఉద్దేశించి సీపీ మాట్లాడారు. ఈ సమావేశంలో జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్, డీసీపీలు ప్రకాశ్ రెడ్డి, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.