ఇది నా ఇలాకా.. ఇక్కడికి ఎవరైనా వచ్చినా.. దాదాగిరి చేయాలని చూసినా లేపేస్తాం ఇది ఒక గ్యాంగ్ మాటలు… వాడి ఇలాకాలో మన గుర్తు వేయాలి.. మన సత్తా చూపించాలి… ఆ గ్యాంగ్ అనుచరులు ఏం చేస్తున్నారో గమనించండి.. అవకాశం దొరికితే వాడి ఇలాకాలోనే వేసేయండి.. లేదంటే ఆ గ్యాంగ్ ఇంకా చాలా బలంగా మారుతుంది ఇది ఇంకో గ్యాంగ్ మాటలు… ఇలా నిరంతరం ఒకరిపై ఒకరు స్కెచ్లు వేసుకుంటూ తుపాకులను పట్టుకుని తిరు గూ మహారాష్ట్ర గ్యాంగ్స్టర్లు హల్చల్ చేస్తుంటారు.. అలాంటి గ్యాంగ్ల్లో ఒకటి ఇప్పుడు ప్రాణ భయంతో సైలెంట్గా హైదరాబాద్కు మకాం మార్చింది. కొద్ది రోజుల పాటు స్తబ్ధుగా ఉందామనుకున్నారు. వారి ఆచూకీ ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు.
వారి ప్రాణ రక్షణ కోసం వెంట తుపాకులను పెట్టుకున్నారు. ఇక హైదరాబాద్లో ఎవరికీ కంటపడమనుకుని తలదాచుకున్నారు. కానీ.. వారి ఉద్యోగం చూసుకునేలోపే రాచకొండ పోలీసులు వారిని చుట్టుముట్టారు. వారిని అదుపులోకి తీసుకుని ముందుగా తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. అప్పడు తెలిసింది పట్టుబడ్డ ఇద్దరు ముంబై, పెన్పిరిచించోడే ప్రాంతంలోని ‘రావణ్ సామ్రాజ్య’ గ్యాంగ్కు చెందిన వారని. వీరి ప్రత్యర్థి సోని కల్బోర్ గ్యాంగ్ ఆ ప్రాంతంలో బలంగా ఉండటంతో నాలుగు సంవత్సరాలు వారితో ఢీకొని ఇటీవల రావణ్ సామ్రాజ్య గ్యాంగ్ బలహీనపడింది. దీంతో ప్రత్యర్థి గ్యాంగ్ కంట్లో పడితే ప్రాణాలు ఉండవని భావించి.. పోలీసులకు దొరికితే పాత కేసుల్లో అరెస్టులు తప్పవని భావించిన నందకిశోర్, రోహన్ రాజీవ్లు హైదరాబాద్కు వచ్చారు. ఇక్కడ ఏ పని దొరికినా చేద్దామనుకున్నారు.
రావణ్ సామ్రాజ్య గ్యాంగ్కు చెందిన నందకిషోర్, రోహన్ రాజీవ్లు నగరంలో అడుగుపెట్టగానే రాచకొండ ఎస్ఓటీ పోలీసులు పట్టుకోవడంతో వారు ఒక్కసారిగా విస్తుపోయారు. మొదట వారు చాలా అమాయకులమని చెప్పడానికి ప్రయత్నించారు. కానీ.. ఎస్ఓటీ పోలీసులు మీ వద్ద తుపాకులు ఉన్నాయి.. వాటిని ఇచ్చేయండని చెప్పడంతో మరింత గందరగోళానికి గురయ్యారు. ఇంత వేగంగా పోలీసులకు మా వద్ద తుపాకులు ఉన్నాయని ఎలా తెలిసిందని అనుకున్నారు. ఆ తర్వాత పోలీసులు విచారించినప్పుడు చాలా విషయాలను దాచిపెట్టాలనుకున్నారు. కానీ పోలీసులు వారి సమాచారాన్ని ముందు పెట్టి అడగడంతో ఈ గ్యాంగ్స్టర్లు నోరు విప్పారు.
రాచకొండ పోలీసు అధికారులు.. తమ నెట్వర్క్ ద్వారా దేశంలోని ప్రధాన పట్టణాలకు చెందిన గ్యాంగ్స్టర్లు, కరుడుగట్టిన నేరగాళ్ల సమాచారం ఎప్పటికప్పుడు వాకబు చేస్తుండటంతో.. ఎవరు నగరానికి వచ్చినా ఆ విషయాన్ని వెంటనే రాబడుతున్నారు. గ్యాంగ్స్టర్లే కాకుండా చైన్ స్నాచర్లు, దోపిడీ దొంగలు, ఇలా అనేక నేరాల్లో నిందితుల డాటాను సేకరించి.. వారు చేసే నేర ప్రక్రియను అధ్యయనం చేసి.. అలాంటి నేరా లు జరిగే స్పాట్లో పోలీసులు తిష్ట వేస్తున్నారు. ఈ కారణంగా హైదరాబాద్ చాలా సురక్షితంగా మారింది. ఇతర రాష్ర్టాల నిందితులతో పాటు కరుడుగట్టిన దొంగల జైలు విడుదలపై సమాచారాన్ని సేకరించి.. వారిపై దృష్టి పెట్టడంతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారు ఇప్పుడు హైదరాబాద్ రావడానికి భయపడుతున్నారు. దీంతో కొద్ది కాలంగా అంతర్రాష్ట్ర ముఠాల కదలికలు తగ్గాయి.