మారేడ్పల్లి, ఫిబ్రవరి 17: ఇంటి యజమాని శుభకార్యానికి వెళ్లడంతో.. ఆ ఇంట్లో పనిచేసే నేపాలీ దంపతులు.. మరో ఇద్దరి సహాయంతో చోరీకి పాల్పడ్డారు. 9 తులాల బంగారం, మూడు కిలోల వెండి నగలతోపాటు ఆరు లక్షల నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులు దంపతులతోపాటు మరోవ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటన కార్ఖానా పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ రవీందర్ కథనం ప్రకారం… కార్ఖానా విక్రంపురి కాలనీలోని ఈ-16 ఫ్లాట్లో స్టీల్ వ్యాపారి నీరజ్కుమార్ అగర్వాల్ ఉంటున్నాడు. అతడి ఇంట్లో నేపాల్కు చెందిన సమ్రాజ్ షాహి (30), లక్ష్మి (25) దంపతులు పని చేస్తున్నారు.
ఈనెల 15వ తేదీ రాత్రి నీరజ్ కుమార్ బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లాడు. ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ దంపతులు సమ్రాజ్ షాహి, లక్ష్మి కలిసి మరో ఇద్దరి సహాయంతో మొదటి అంతస్థులో ఉన్న అల్మారాను పగులగొట్టారు. అందులో ఉన్న నగదు, బంగారం, వెండి ఆభరణాలు చోరీ చేశారు. సెల్లార్లో నిద్రపోతున్న డ్రైవర్ సాయికృష్ణ శబ్ధంతో మేల్కొని పైకి వెళ్లి చూడగా.. ఇంట్లో చోరీ జరుగుతున్న విషయాన్ని గుర్తించాడు. ఈ విషయాన్ని ఇంటి యజమానికి చేరవేశాడు. ఇంటి యజమాని కార్ఖానా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా నేపాలీ దంపతులతోపాటు, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరోవ్యక్తి పరారీలో ఉన్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.