సిటీబ్యూరో, మే 27(నమస్తే తెలంగాణ) : ఓ వైపు శాంతి భద్రతలను పరిరక్షిస్తూనే మరోవైపు మహమ్మారి కట్టడిలో నిమగ్నమవుతున్నారు.. పని భారం ఎంత పెరిగినా.. ఒత్తిడి లేకుండా ప్రజా సేవే పరమావదిగా సేవలందిస్తున్నారు. ఇలా స్టేషన్హౌస్ అధికారులు కరోనా నియంత్రణలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ.. సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ.. లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. పోలీస్స్టేషన్ విధులతో పాటు చెక్పోస్టుల వద్ద సిబ్బంది మోహరింపు..వారికి సౌకర్యాల కల్పన ఇలా ప్రతీది దగ్గరుండి చూసుకుంటున్నారు. రోజుకు 18 గంటల పాటు డ్యూటీ చేయాల్సి వస్తున్నా.. మాకు ఇబ్బంది లేదని..ప్రజల రక్షణే మా మొదటి కర్తవ్యంగా భావిస్తున్నామంటున్నారు. ‘నమస్తే’తో ప్రత్యేకంగా మాట్లాడిన ఎస్హెచ్వోలు తమ మనోగతాన్ని పంచుకున్నారు. ప్రజల భద్రతే.. మా బాధ్యత అని స్పష్టం చేస్తున్నారు. ఏ సమయంలోనైనా ప్రజా సేవకు సిద్ధంగా ఉంటామని అభయం ఇస్తున్నారు. నిత్యం ఉన్నతాధికారుల ప్రోత్సాహం తమకు కొండంత ధైర్యాన్ని ఇస్తున్నదని చెబుతున్నారు. ఇంకా ఏమన్నారో వారి మాటల్లోనే.. .
లాక్డౌన్ సమయంలో మా సీపీ సార్ అందిస్తున్న ప్రోత్సాహం, కల్పిస్తున్న సౌకర్యాలు సంతృప్తినిస్తున్నాయి. సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సమయానికి మాస్కులు, మంచినీళ్లు, డ్రైఫ్రూట్స్ను అందిస్తున్నారు. లాక్డౌన్ సందర్భంగా సిబ్బందికి మూడు షిఫ్టులుగా విధులను విభజించి వారికి చెక్ పాయింట్ల వద్ద డ్యూటీని అప్పగిస్తున్నాం. ఎవరూ కష్టంగా భావించకుండా సంతోషంగా డ్యూటీ చేస్తున్నారు. ఈవిధులతో పాటు.. స్టేషన్కు వచ్చే వారికి కావాల్సిన సేవలను అందిస్తున్నాం. -చంద్రబాబు, ఇన్స్పెక్టర్, ఘట్కేసర్ పీఎస్
లాక్డౌన్ వచ్చిన తర్వాత మా పని మరింతగా పెరిగింది. ఉదయం 7 గంటలకు విధుల్లోకి వస్తే..తిరిగి రాత్రి 12 గంటలకు ఇంటికి చేరుకుంటున్నాం. కానీ మాకు ఎలాంటి ఆందోళన, బాధ లేదు. మా సీపీ సార్ మా సంక్షేమం కోసం కల్పిస్తున్న సౌకర్యాలతో మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. డ్యూటీ 18 గంటలు చేయాల్సి వస్తున్నా.. కష్టంగా అనిపించడం లేదు. సైబరాబాద్ పరిధిలో మా సిబ్బందికి షిఫ్టుల వారీగా విధులను అప్పగిస్తున్నాం. దీనివల్ల వారిపై ఒత్తిడి తగ్గి సమర్థవంతంగా పనిచేస్తున్నారు. -రవీంద్ర ప్రసాద్, ఇన్స్పెక్టర్ మాదాపూర్ పీఎస్
లాక్డౌన్ విధులు భారం కావడం లేదు. సీపీ సార్ నిత్యం సిబ్బంది సంక్షేమంతో పాటు విధులకు అంతరాయం కలుగకుండా చూస్తున్నారు. మాలో ఉత్సాహాన్ని, ధైర్యాన్ని నింపుతున్నారు. అందుకే ఏ చిన్న కష్టం లేకుండా హ్యాపీగా పనిచేసుకోగలుగుతున్నాం. షిఫ్టుల వారీగా సిబ్బందికి పని అప్పగిస్తున్నాం. దీంతో వారు ఎంత పని ఉన్నా.. అలుపెరుగకుండా.. విధులు నిర్వహిస్తున్నారు. -సుధీర్కుమార్, ఇన్స్పెక్టర్, శామీర్పేట్ పీఎస్
కరోనా, లాక్డౌన్తో ఏర్పడిన పరిస్థితుల్లో నిర్వర్తిస్తున్న విధులు మాకు భారం కాదు.. అది మా బాధ్యత. ప్రజల భద్రతే ముఖ్యం. తోటి సిబ్బంది నమన్వయంతో సమర్థవంతంగా డ్యూటీ చేస్తున్నాం. కమిషనర్ సార్ అందిస్తున్న సహకారం మాలో ఉత్సాహాన్ని ఇస్తున్నది. సిబ్బందిలో కలవరం, ఆందోళనను తొలగించేందుకు ఆయన తీసుకుంటున్న చర్యలు అందరిలో భరోసా నింపుతున్నది. -సురేందర్, ఇన్స్పెక్టర్, హయత్నగర్ పీఎస్