Hyderabad | హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణాల జోరు నడుస్తున్నది. శివారు మున్సిపాలిటీల్లో అధిక సంఖ్యలో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లా కేంద్రాల కంటే ఎక్కువ సంఖ్యలో హైదరాబాద్ శివారు మున్సిపాలిటిల్లోనే నిర్మాణాలు అధికంగా జరుగుతుండటం విశేషం. టీఎస్బీపాస్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు అనుమతుల లెక్కలను పరిశీలిస్తే ఇదే స్పష్టం అవుతున్నది. రాష్ట్రంలో లే అవుట్లు పెరుగుతున్నాయి. లేఅవుట్ల అనుమతుల కోసం దరఖాస్తుల సైతం భారీగా వస్తున్నాయి.
పట్టణాల్లో ఇండ్ల నిర్మాణాల్లో పారదర్శకత, నిర్దిష్ట సమయంలో అనుమతులు ఇవ్వాలనే ఉద్దేశంతో దేశంలోనే తొలిసారిగా టీఎస్బీపాస్ ఆన్లైన్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. 20 20 నవంబర్ 16న అందుబాటులోకి రాగా, ఇప్పటి వరకు 1.76 లక్షల దరఖాస్తుల్లో 1.26 లక్షల దరఖాస్తులకు అనుమతులు లభించాయి. 20,286 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యా యి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు 1,306 లేఅవుట్ల అనుమతుల కోసం దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 588 దరఖాస్తులకు అనుమతులు ఇచ్చారు. 253 తిరస్కరించారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. లేఅవుట్లకు అనుమతుల విధానాన్ని గత ఏడాది తీసుకొచ్చారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం 9,962 దరఖాస్తులు వచ్చాయి. ఇటీవలే ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్లను టీఎస్బీపాస్ ద్వారా అందిస్తున్నారు.
టీఎస్బీపాస్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధిక నిర్మాణాలు జరుగుతున్నాయని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. తర్వాతి స్థానంలో వరంగల్ కార్పొరేషన్ ఉన్నది. టాప్-10లో జీహెచ్ఎంసీ సహా నగర శివారు మున్సిపాలిటీలు 6 ఉన్నాయి. బడంగ్పేట, తుర్కయాంజల్, బోడుప్పల్, నాగారం, పెద్ద అంబర్పేట మున్సిపాలిటీలు ముందున్నాయి. జనాభా పరంగా రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లా కేంద్రాల కంటే ఈ మున్సిపాలిటీలు తక్కువగా ఉన్నా, నిర్మాణాలు మాత్రం పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వరంగల్, నిజామాబాద్, ఖమ్మంతో ఈ 6 మున్సిపాలిటీలు పోటీపడుతున్నాయి. నిర్మాణాల్లో దాదాపు 10 లక్షలకు పైగా జనాభా ఉన్న వరంగల్కు, బడంగ్పేట లాంటి మున్సిపాలిటీకి కొద్ది తేడానే ఉండటం విశేషం. ఐటీ, ఇతర పరిశ్రమల ఉండటం, ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు పెరగటం వల్ల చాలా మంది ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి మొగ్గుచూపుతున్నారు. దాంతో శివారు ప్రాంతాల్లో నిర్మాణాలు భారీగా పెరుగుతున్నాయి.