మేడ్చల్, డిసెంబర్ 12(నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 13 వేల 450 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 2473 మంది రైతుల ఖాతాల్లో రూ.22.26 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. జిల్లాలో 11 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వం కొనుగోలు పూర్తయిన 3 కేంద్రాలను మూసివేసి మిగతా 8 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. మరో 10 రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తికానున్నట్లు అధికారులు తెలిపారు. పండించిన ధాన్యాన్ని అంచనా వేసిన వ్యవసాయాధికారుల సూచనల మేరకు ఫౌర సరఫరాలశాఖ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించింది. పండించిన ధాన్యం పూర్తయ్యే వరకు కొనుగోలు కేంద్రాలను కొనసాగించనున్నట్లు అధికారులు వివరించారు. సాధారణ రకానికి క్వింటా రూ.2,060 చెల్లించగా.. గ్రేడ్-2వ రకానికి రూ.2,040లను ప్రభుత్వం చెల్లిస్తున్నది. మరో 5 వేల మెట్రిక్ టన్రుల ధాన్యం రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వంతోపాటు రైస్ మిల్లర్లు ధాన్యాన్ని కొనేందుకు ఈ సీజన్లో ముందుకు వచ్చారు. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయమని స్పష్టం చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేసింది.
మూడురోజుల్లో నగదు జమ
కొనుగోలు చేసిన ధాన్యానికి 3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నగదును జమ చేస్తున్నది. ధాన్యం కొనుగోలు చేసే సమయంలోనే రైతులకు చెందిన పట్టాదారు పాసుపుస్తకాలు, బ్యాంక్ ఖాతాల జిరాక్స్లను తీసుకుని తక్షణమే నగదును నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేయిస్తున్నాం. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరుగకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశాం. రైతులు పండించిన వరి ధాన్యం పూర్తయ్యే వరకు కొనుగోలు కేంద్రాలు కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. – మధుకర్రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్