అమీర్పేట్, నవంబర్ 13: నైజీరియాలో పని చేస్తున్న కడప జిల్లా వాసికి అపోలో స్పెక్ట్రా ఆస్పత్రి వైద్యులు సేవలందించి ప్రాణం పోశారు. నైజీరియా – లాగోస్లోని ఓ ఆహార తయారీ కర్మాగారంలో ప్రొడక్షన్ మేనేజర్గా పని చేస్తున్న మద్దెం శశికాంత్రెడ్డి ఎన్సెఫాలోపతితో పాటు మలేరియాకు గురై మరణం అంచుల దాకా వెళ్లాడు. అయితే, విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అమీర్పేట్లోని అపోలో స్పెక్ట్రా ఆసుపత్రి వైద్యుల సహకారంతో తదుపరి వైద్య చికిత్సలు నగరంలో అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు సెప్టెంబర్ 28న 15 గంటల పాటు కృతిమ శ్వాస (మెకానికల్ వెంటిలేటర్) మద్దతుతో రోగిని లాగోస్ నుంచి ఎయిర్ అంబులెన్స్ ద్వారా అమీర్పేటలోని ఆసుపత్రికి తరలించారు. రోగికి మెయిన్ వైడ్ పైప్ చీలిక, బ్రెయిన్ మలేరియా సంబంధిత సమస్యలతో పాటు మూత్ర పిండాల వైఫల్యం, హార్ట్ అరెస్ట్, ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటి పలు సమస్యలతో ప్రమాదకర స్థితిలో ఉన్నప్పటికీ రోగికి వైద్యులు చికిత్స అందిం చి జీవం పోశారు. ఈ మేరకు శనివారం అమీర్పేట్లోని అపోలో స్పెక్ట్రాలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వైద్యులు రోగికి అందించిన వైద్యాన్ని వివరించారు. రోగికి వైద్య అందించిన వైద్య బృందానికి నేతృత్వం వహించిన కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ అండ్ వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ రవిరాజు చిగుళ్ళపల్లి మాట్లాడుతూ రోగికి ఎదురైన అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వైద్య నిపుణులు సలహాలు సూచనలతో దాదాపు 47 రోజుల పాటు శ్రమించి మామూలు స్థితికి తీసుకురావడం జరిగిందన్నారు. సర్జన్లు డాక్టర్ దాసరి ప్రసాదరావు, డాక్టర్ రవిరాజుల పర్యవేక్షణలో పల్మనాలజిస్ట్ డాక్టర్ ప్రఫుల్ల చంద్ర, క్రిటికల్ కేర్ వైద్య బృందం డాక్టర్ బోస్, డాక్టర్ వరలక్ష్మి, డాక్టర్ సంపత్, డాక్టర్ చంద్రశేఖర్లు రోగి ఆరోగ్య పరిస్థితి అనుక్షణం సమీక్షిస్తూ రోగికి కొత్త జీవితాన్ని అందించారు. వైద్యుల చొరవతో తాను పూర్తిగా కోలుకున్నాని రోగి శశికాంత్రెడ్డి వెల్లడించారు.