బడంగ్పేట, డిసెంబర్ 11: నిజాంకాలంలో సైనికుల స్థావరంగా ఉన్న బడంగ్పేట సుబ్రమణ్యం కాలనీలోని బట్టేల్గుట్టను గోల్కొండ కోటలా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చారిత్రాత్మకమైన కట్టడాలను భవిష్యత్ తరాలకు అందించాలన్న లక్ష్యంతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక దృష్టిసారించి రూ.1.10 కోట్లు కోటాయించడంతో అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయి. గుట్ట చుట్టూ పచ్చని చెట్లు, పూల మొక్కలు, భూమికి పచ్చని రంగేసినట్లు కొత్త అందాలను సంతరించుకున్నది. రానున్న రోజుల్లో గుట్టపై జాతీయ జెండాను ఎగురవేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు పనులు పూర్తికాగా త్వరలోనే ప్రారంభించనున్నామని కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డి, డీఈఈ అశోక్ రెడ్డి తెలిపారు.
బట్టేల్గుట్ట చర్రిత..!
బట్టేల్గుట్ట వందల ఏండ్ల కిందట సైనిక స్థావరానికి నిలయంగా ఉండేది. బడంగ్పేట చుట్టూ పెద్ద కోట బురుజులు, గ్రామ ప్రధాన కూడలిలో నిజాం నాకా ఉండేది. ఇక్కడ వజ్రాలు, వైఢూర్యాలు అమ్ముకునే వారని పూర్వీకులు చెబుతుండేవారు. గ్రామ ప్రధాన కూడలిలో ఉన్న నిజాం నాకాను కొంత కాలం పాటు బడంగ్పేట గ్రామ పంచాయతీ కార్యాలయానికి ఉపయోగించారు. ఇటీవల రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించారు. ప్రస్తుతం ఉన్న బట్టేల్ గుట్ట కొంత మేర కబ్జాకు గురికాగా.. మిగితా స్థలాన్ని కాపాడేందుకు చుట్టూ ఫెన్సింగ్ వేశారు.
గుట్టపై ఏర్పాట్లు..!
విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు మేయర్ చిగిరింత పారిజాత నర్సింహరెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశంలో దశల వారీగా నిధులు కేటాయించి గుట్టను అభివృద్ధి చేయాలని తీర్మానం చేశారు.
గుట్ట చుట్టూ ఫెన్సింగ్, వాకింగ్ ట్రాక్ల ఏర్పాటు పూర్తి చేశారు.
పార్కుకు వచ్చే పిల్లల కోసం వివిధ రకాల జంతువులు, పక్షుల ప్రతిమలను ఏర్పాటు చేయనున్నారు.
ఫొటో షూట్ స్పాట్గా మార్చడానికి వివిధ రకాల బొమ్మలను ఏర్పాటు చేస్తున్నారు.
గుట్టపై ఉన్న బురుజుపై గణతంత్ర, స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా జాతీయ జెండా ఎగుర వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
పార్కు మధ్యలో గౌతమ బుద్ధుడి విగ్రహం ఏర్పాటు చేయనున్నారు.
ప్రత్యేకంగా యోగా కేంద్రం ఏర్పాటుకు సన్నాహలు
ఆహ్లాదాన్ని పంచాలని..!
నియోజకవర్గం వ్యాప్తంగా పార్కులను అభివృద్ధి చేస్తున్నాం. పిల్లలు ఆడుకోవడానికి, వృద్ధులు సేద తీరడానికి కోట్లాది రూపాయలు కేటాయించి పార్కులను సుందరంగా తీర్చిదిద్దుతున్నాం. ఖాళీ స్థలాలు కబ్జాకు గురికాకుండా రక్షణ కల్పిస్తూ ప్రజా అవసరాలకు వినియోగిస్తున్నాం. వందల ఏండ్ల చరిత్ర కలిగిన బట్టేల్గుట్టను గోల్కొండ కోట మాదిరిగా తీర్చిదిద్దుతున్నాం.
– సబితాఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి
ప్రహరీ నిర్మించాల్సి ఉంది
బట్టేల్ గుట్ట పార్కును రూ.1.10 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం. మంత్రి ఆదేశాల మేరకు, పాలకవర్గం సహకారంతో గుట్టకు కొత్త అందాలు తీసుకువస్తున్నాం. ఇప్పటికే పార్కు పనులు పూర్తికాగా.. చుట్టూ ప్రహరీ నిర్మించాల్సి ఉంది. త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం.
-కృష్ణమోహన్ రెడ్డి, కమిషనర్
పర్యాటక ప్రాంతంగా..
నిరుపయోగంగా ఉన్న బట్టేల్గుట్టను ప్రజలకు ఉపయోగ పడేలా, ఆహ్లాదాన్ని పంచేలా తీర్చిదిద్దుతున్నాం. అన్ని హంగులతో పార్కును అభివృద్ధి చేస్తున్నాం. రానున్న రోజుల్లో పర్యాటక ప్రాంతంగా మారుతుంది.
-బీమిడి స్వప్న జంగారెడ్డి, కార్పొరేటర్