సిటీబ్యూరో, మార్చి 28 (నమస్తే తెలంగాణ): కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద అరబిందో ఫార్మా ఫౌండేషన్ (ఏపీఎఫ్) ఆధ్వర్యంలో రూ.80 కోట్లతో ఎంఎన్జే అత్యాధునిక బ్లాక్ నిర్మాణం పూర్తయినట్లు ఏపీఎఫ్ డైరెక్టర్ కే.నిత్యానందరెడ్డి మంగళవారం తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా క్యాన్సర్ రోగుల కోసం ఆధునిక వసతులతో భవనాన్ని నిర్మించి అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో క్యాన్సర్ రోగులకు ఉచితంగానే చికిత్సను అందజేస్తున్నారని, తమ వంతు బాధ్యతగా అత్యాధునిక హంగులతో క్యాన్సర్ బ్లాక్ను నిర్మించామని నిత్యానందరెడ్డి పేర్కొన్నారు. సెంట్రలైస్డ్ ఏసీ కలిగిన 300 బెడ్స్, 2 ఆపరేషన్ థియేటర్లు, కన్సల్టేషన్ గదులు, 2 రేడియేషన్ బంకర్స్ నిర్మాణం పూర్తి చేశామని వెల్లడించారు. అరబిందో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంకాలజీ బ్లాక్ నిర్మాణం పూర్తిచేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సెల్లార్, లోయర్ గ్రౌండ్, గ్రౌండ్+5 అంతస్తుల్లో మొత్తం పడకల సామర్థ్యం 300. ఇది 30 వార్డులు, 2ఆపరేషన్ థియేటర్లు, 12 కన్సల్టేషన్ గదులు, 2 రేడియాలజీ బంకర్లు, 8 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ గదులు, డెడికేటెడ్ పీడియాట్రిక్, అడోల్సెంట్ ఐసీయూలు, ఆక్సిజన్ పైప్లైన్లు వంటి అత్యాధునిక పద్ధతిలో పనులు పూర్తిచేసినట్లు వెల్లడించారు.