సిటీబ్యూరో, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని మెట్రో రైళ్ల వేళలను పొడిగించినట్లు హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి వరకు నగరవాసులంతా సంబురాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉండే రైళ్లను 1 గంట వరకు నడుపుతున్నట్లు చెప్పారు.
చివరి రైళ్లు ప్రారంభ స్టేషన్ నుంచి రాత్రి 12.15 గంటలకు బయలుదేరి, ఆఖరి స్టేషన్కు ఒంటి గంట సమయంలో చేరుకుంటాయన్నారు. నగరవాసులు బాధ్యతాయుతంగా ప్రయాణం చేయాలని, ప్రయాణికులు మద్యం సేవించి, దుర్భాషలాడకుండా మెట్రో రైలు పోలీసులు, సెక్యూరిటీ వింగ్లు నిఘా ఉంచుతాయని స్పష్టం చేశారు.