Hyderabad | ఏజెంట్ల మోసం కారణంగా రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో హైదరాబాద్ యువకుడు మరణించాడు. రష్యా తరఫున పోరాడుతూ నాంపల్లిలోని బజార్ఘాట్కు చెందిన మహ్మద్ ఆస్ఫాన్ (30) ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని అధికారులు బుధవారం వెల్లడించారు.
హైదరాబాద్లోని నాంపల్లి బజార్ ఘాట్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఆస్ఫాన్తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మరికొంతమంది లేబర్ పని కోసం గత ఏడాది గల్ఫ్ దేశానికి వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత సెక్యూరిటీ లేబర్గా పనిచేస్తే ఎక్కువ జీతం వస్తుందని స్థానిక ఏజెంట్లు ఆశ చూపి రష్యాకు పంపించారు. అక్కడ రష్యన్ ఆర్మీలో సెక్యూరిటీ లేబర్, కుక్గా పనిచేయించుకున్నారు. కాగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో గత ఏడాది డిసెంబర్ 31వ తేదీన రష్యన్ ఆర్మీతో కలిసి వారు ఉక్రెయిన్లోకి వెళ్లారు. ఆ తర్వాత వారి దగ్గర నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో బాధితుల కుటుంబాలు ఆందోళనకు గురయ్యాయి. ఈ క్రమంలోనే తమ బిడ్డ ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన విషయాన్ని ఆస్ఫాన్ కుటుంబసభ్యులు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దృష్టికి తీసుకెళ్లారు. వారిని వెనక్కి తీసుకురావాలని కోరారు. వాళ్ల విజ్ఞప్తిపై స్పందించిన ఒవైసీ.. మాస్కోలోని భారత రాయబార కార్యాలయానికి లేఖ రాశారు. ఈ క్రమంలో రష్యా సైన్యానికి సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న 20 నుంచి 30 మంది భారతీయుల్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో హైదరాబాద్ యువకుడు చనిపోయిన విషయం తెలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. ఆస్ఫాన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఉద్యోగాల కోసం వెళ్లి మోసపోయి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుపోయిన యువకుల్ని తిరిగి తీసుకొచ్చేందుకు సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.