సిటీబ్యూరో, జనవరి 17 (నమస్తే తెలంగాణ): జిల్లాలో ఉన్న భూములు అన్యాక్రాంతం కాకుండా, కబ్జాలు కాకుండా రక్షించడంపై జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి దృష్టి సారించారు. జిల్లాలో ఉన్న భూముల విలువ కోట్లలో ఉంది. దీంతో చాలా మంది పలుకుబడి ఉన్న బడా బాబులు, సంపన్న వర్గాలకు చెందిన వారు తమ పలుకుబడితో జిల్లాలో ఉన్న వందల ఎకరాల భూములను యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. దీంతో పేద, మధ్య తరగతులకు చెందిన భూములతో పాటు ప్రభుత్వానికి చెందిన అనేక భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోతున్నాయి.
ఈ క్రమంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఆ భూములను కాపాడటం కోసం జిల్లాలో నూతన విధానాన్ని ప్రవేశ పెట్టే దిశగా జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా జిల్లాలో ఉన్న అన్ని రకాల భూములను డిజిటలైజేషన్ చేయాలని జిల్లా కలెక్టర్ ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. భూముల డిజిటలైజేషన్ పనులు ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ.. ప్రస్తుతం సిబ్బంది మొత్తం ఆరు గ్యారంటీలు, ఇతర పనుల్లో నిమగ్నమయ్యారన్నారు.
ఈ క్రమంలో వచ్చే నెలలో సిబ్బందిని పరిగణనలోకి తీసుకుని భూములను డిజిటలైజ్ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తామన్నారు. వచ్చే నెలలో మండలాలు, గ్రామాల వారీగా ఉన్న భూములను గుర్తిస్తామని, ఇందుకోసం స్థానిక తాసీల్దార్తో సర్వే నిర్వహిస్తామన్నారు. జిల్లాలో ఎన్ని భూములు ఉన్నాయి? ఏయే సర్వేలో ఉన్నాయి? ఓనర్లు పరిస్థితి ఏమిటీ వంటి సమగ్ర సమాచారాన్ని డిజిటలైజేషన్ చేస్తామన్నారు. అయితే డిజిటలైజేషషన్ కంటే ముందుగానే సంబంధిత రెవెన్యూ అధికారులతో పాటు తాసీల్దార్లతో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియను ప్రారంభించే ముందు తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకున్నాకే డిజిటలైజేషన్ను ప్రారంభిస్తామని జిలా కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లాలో ప్రభుత్వానికి సంబంధించిన భూములు, అసైన్డ్ భూములు, ఎండోమెంట్ భూములతో పాటు పలు ప్రభుత్వ విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు ఇతరత్రా భూములను కాపాడటం కోసం డిజిటలైజేషన్ చేయాల్సిన తప్పనిసరి పరిస్థితి నెలకొన్నదని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై జిల్లా అదనపు కలెక్టర్, డీఆర్వో, హైదరాబాద్, సికింద్రాబాద్కు చెందిన ఆర్డీవో వంటి అధికారులతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అయితే ఫిబ్రవరి నెలాఖరుకు లేదా మార్చి నాటికి జిల్లాలో ఉన్న అన్ని రకాల భూములను డిజిటలైజ్ చేయడం కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని (స్పెషల్ డ్రైవ్) నిర్వహించడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.