సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): పర్యావరణహిత ఆఫీసు భవనాల(గ్రీన్ బిల్డింగ్స్) నిర్మాణంలో హైదరాబాద్ మెరుగైన వృద్ధి రేటును నమోదు చేస్తోంది. గడిచిన నాలుగేళ్ల వ్యవధిలోనే రెట్టింపు స్థాయిలో గ్రీన్ బిల్డింగ్ల నిర్మాణం జరిగింది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలైన బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై తర్వాత 4వ స్థానంలో హైదరాబాద్ నిలిచిందని సీబీఆర్ఈ నివేదిక వెల్లడించింది. జూన్ 2023 నాటికి దేశ వ్యాప్తంగా గ్రీన్ ఆఫీస్ స్టాక్లో 68 శాతం వాటాను బెంగళూరు, ఢిల్లీ, ముంబై కలిగి ఉంటే, 15% వాటా హైదరాబాద్కు ఉంది. వీటి తర్వాత 9 శాతంతో చెన్నై, 8 శాతంతో పుణె నగరాలు ఉన్నాయి. 2019 నుంచి 2023 వరకు దేశంలోని మొదటి ఆరు నగరాల్లో గ్రీన్ ఆఫీస్ భవనాల విస్తీర్ణం 36 శాతం పెరిగి 342 మిలియన్ చదరపు అడుగులకు చేరుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. నగరంలో ఐటీ కార్యకలాపాలతో పాటు ఇతర రంగాలకు చెందిన వ్యాపారాలకు కేంద్రంగా నగరం మారడంతో ఆఫీస్ స్పేస్కు విపరీతమైన డిమాండ్ నెలకొంది. దీంతో రియల్ ఎస్టేట్ సంస్థలు సాధారణ భవనాలతో పాటు పర్యావరణహిత భవనాలను నిర్మించేందుకు ముందుకువస్తున్నట్లు పేర్కొన్నారు. భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్లో హైదరాబాద్ వివిధ అంశాల్లో అత్యంత అనుకూలమైన పురోగతిని సాధిస్తోంది. రియల్ ఎస్టేట్ ఆస్తులపై లీజింగ్ కార్యకలాపాలు 2023 ప్రథమార్థంలో స్థిరంగా ఉన్నాయని, ఈ ఏడాది చివరి నాటికి వృద్ధి చెందుతుందని, ప్రధానంగా రిటైల్ లీజింగ్ పెరగడంతో పాటు పారిశ్రామిక, లాజిస్టిక్ రంగం గణనీయమైన వృద్ధిని సాధిస్తోందని నివేదికలో పేర్కొన్నారు.