చక్కటి వాతావరణం.. శాంతిభద్రతలు.. పుష్కలమైన మౌలిక వసతులు.. నలువైపులా రవాణా సౌకర్యం.. ప్రశాంత జీవనం.. సుస్థిరాభివృద్ధి.. ఇతర మెట్రో నగరాలతో పోల్చుకుంటే.. అత్యంత అనుకూలమైన నివాసయోగ్యమైన ప్రాంతం.. పైగా స్థలం మీద పెట్టుబడి పెడితే.. లాభామే తప్ప.. నష్టం ఉండదు.. ఇవన్నీ అనుకూలతలు ఉత్తరాదీలను హైదరాబాద్ వైపు చూసేలా చేస్తున్నాయి. వ్యాపారవేత్తలు, అధికారులు ఖాళీ స్థలాలు, విల్లాల కొనుగోళ్లకు ఇష్టపడుతుంటే.. ఉద్యోగులు అపార్ట్మెంట్లలో 3 బీహెచ్కేలపై ఆసక్తి చూపుతున్నారు. బెంగళూరు, చెన్నై టెక్కీలు సైతం భాగ్యనగరంలోనే ఇండ్లు కొనేందుకు ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్లో కొనుగోళ్లను పరిశీలిస్తే అత్యధికంగా ఢిల్లీ, గుజరాత్, పంజాబ్ వాసులే అధికంగా ఉంటున్నారని ఆ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : భాగ్యనగరంలో భద్రమైన జీవితం గడపొచ్చు. మిగతా మెట్రో నగరాలతో పోల్చితే ఇక్కడి జీవనం అత్యంత సురక్షితం. మెరుగైన శాంతిభద్రతలు.. నలువైపులా రవాణా సౌకర్యం ..అన్నింటికంటే ఈ ప్రాంతంలో భూమి మీద పెట్టుబడి పెడితే లాభమే కానీ నష్టం ఉండదు..ఇది హైదరాబాద్ నగరంలో శాశ్వత నివాసాల వైపు మొగ్గు చూపుతున్న ఉత్తరాదీవాసుల మనోగతం.. వ్యాపారవేత్తలు, అధికారులంతా ఖాళీ స్థలాలు, విల్లాలు మొగ్గు చూపుతుంటే… ఉద్యోగులు అపార్ట్మెంట్లలో 3 బీహెచ్కేకు ఆసక్తి కనబర్చుతున్నారు. ఈ విషయాన్ని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) సభ్యులు, హైదరాబాద్ క్రెడాయ్ సభ్యులు స్పష్టం చేస్తున్నారు.
హైటెక్స్లో శుక్రవారం నరెడ్కో ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే ప్రాపర్టీ షో ప్రారంభం కాగా, పలు రాష్ర్టాల నుంచి వచ్చిన బిల్డర్లు ఈ ప్రాపర్టీలో తమ ప్రాజెక్టులను ప్రదర్శనలో ఉంచారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్లో కొనుగోళ్లను పరిశీలిస్తే అత్యధికంగా ఢిల్లీ, గుజరాత్, పంజాబ్వాసులే అధికంగా ఉంటున్నారని ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా నార్త్ ఇండియన్స్తో కలిసి స్థానిక బిల్డర్లు భారీ మొత్తంలో ప్రాజెక్టులు చేపట్టేందుకు ఆసక్తి కనబర్చుతున్నారని, హైదరాబాద్ కేంద్రంగా ఉన్న బిల్డర్లు, డెవలపర్లు స్థానికంగా ఈ రంగంపై గట్టి పట్టు ఉండడంతో నార్త్ ఇండియన్ కంపెనీలు వారితో కలిసి ప్రాజెక్టులు చేపడుతున్నారని చెబుతున్నారు.
సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కేంద్రం…
కొవిడ్ కంటే ముందు బెంగుళూరు, చెన్నై కేంద్రంగా పని చేసే రాష్ర్టానికి చెందిన సాఫ్ట్వేర్, ఇతర రంగ ఉద్యోగులంతా ప్రస్తుతం హైదరాబాద్కు మకాం మార్చుతున్నట్లు రియల్ రంగ నిపుణుడు ఎం. విజయ సాయి చెప్పారు. వర్క్ ఫ్రం హోమ్, హైబ్రిడ్ విధానంతో ఇండ్లను కొనుగోలు చేసి ఇక్కడే ఉండేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇక్కడ పెట్టుబడిలో రెట్టింపు ప్రయోజనం ఉంటుందని వారు చెబుతున్నట్లు తెలిపారు.
ఈస్ట్ జోన్లోనూ కొనుగోళ్ల హవా
హైదరాబాద్ నగరం చుట్టూ భారీగా కొత్త ప్రాజెక్టులు వస్తుండడంతో కొనుగోలు దారులు ఆసక్తి చూపుతున్నారు. అద్దెల రాబడి కూడా అధికంగా ఉంటుండంతో స్థిరాస్తి రంగంపై మొగ్గు చూపడం అధికమైందని హైదరాబాద్ క్రెడాయ్ జనరల్ సెక్రటరీ వి. రాజశేఖర్ రెడ్డి తెలిపారు. మెట్రో సౌకర్యం అందుబాటులో ఉండడంతో.. ముఖ్యంగా ఉప్పల్, ఎల్బీ నగర్ మార్గం వైపు కూడా కొనుగోలు దారులు ఆసక్తి కనబరుస్తున్నట్లు చెప్పారు.. వరంగల్ రహదారి మార్గంలో ఘట్కేసర్ వరకు ఇండిపెండెంట్ ఇండ్లు, అపార్ట్ మెంట్లలో ఫ్లాట్లు కొనుగోళ్లు వేగవంతం అయ్యాయని , ఎకడ ఉన్నా ఆఫీసుకు గంటలోపే చేరుకునే సౌలభ్యం ఉండడంతో శివారు ప్రాంతంలో కూడా కొనుగోళ్లు ఎకువయ్యాయని రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. దాంతో నిర్మాణాలు అదే స్థాయిలో అందుబాటులో ఉంటున్నాయని, మరోవైపు నాగోలు, బండ్లగూడ, హస్తినాపురం, బీఎన్ రెడ్డినగర్, వనస్థలిపురం, హయత్ నగర్ వరకు నివాసాలకు డిమాండ్ పెరిగిందన్నారు.
ఈ ఏరియాలో విపరీతమైన డిమాండ్
నగర శివారు చుట్టూ 20 నుంచి 30 కిలోమీటర్ల వరకు ఉన్న ప్లాట్లకు డిమాండ్ భారీగా పెరిగిందని, గేటెడ్ కమ్యూనిటీలపై కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నట్లు నరెడ్కో సభ్యులు ఒకరు తెలిపారు. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గం, కోకాపేట్, మణికొండ, నార్సింగి, పుప్పాలగూడ, ప్రగతినగర్, నిజాంపేట, బాచుపల్లి, మియాపూర్, మదీనాగూడ, చందానగర్, లింగంపల్లి, బీరంగూడ ప్రాంతాల్లోని నివాస గృహాలకు డిమాండ్ విపరీతంగా ఉందన్నారు.