సిటీబ్యూరో, జనవరి 12 ( నమస్తే తెలంగాణ ) : జార్ఖండ్లో మారణహోమం సృష్టించిన చిరుతను పట్టుకోవడం కోసం నగరానికి చెందిన ప్రముఖ వేటగాడు, జార్ఖండ్తో సహా 9 రాష్ట్రాలకు వన్యప్రాణుల సలహాదారుడు నవాబ్ సఫత్ అలీఖాన్ చర్యలు ముమ్మరం చేశారు. చిరుతపులిని పట్టుకోవడం కోసం 64 ఏండ్ల ఖాన్ ఈనెల 5 నుంచి జార్ఖండ్లో మకాం వేసిన విషయం తెలిసిందే. డిసెంబర్లో గార్హ జిల్లాలో చిరుత దాడిలో ముగ్గురు చిన్నారులు, లతేహార్ జిల్లాలో ఒకరితో సహా ఆరు నుంచి 12 ఏండ్ల మధ్య నలుగురు పిల్లలు చిరుత దాడిలో మరణించారు.
ఆ చిరుతను పట్టుకోవడం కోసం అక్కడి ప్రభుత్వం కాల్పులకు అనుమతిచ్చే యోచనలో ఉంది. కాగా, ఆ చిరుతను బోనులో చిక్కించేందుకు ఖాన్ అనేక ఉపాయాలు పన్నుతున్నాడు. ఇప్పటికే 50కి పైగా ట్రాప్ కెమెరాలు, ఒక డ్రోన్తో చిరుత కదలికలపై నిఘా ఉంచారు. అయితే ఈనెల 5, 10న చిరుత కదలికలు కెమెరాలో రికార్డు అయినట్టు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వైల్డ్ లైఫ్) శశికర్ సమంత మాట్లాడుతూ..చిరుతపులికి వ్యతిరేకంగా షూట్-ఎట్-సైట్ ఆర్డర్స్పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.అనేక మంది నిపుణుల నుంచి సలహాలు తీసుకుంటున్నామని చెప్పారు. షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్పై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఖాన్ మాట్లాడుతూ.. గర్వాలోని తిర్తిడి గ్రామంలో గురువారం తెల్లవారుజామున బోను వెలుపల ఉంచిన పందిని చిరుత చంపేసిందని తెలిపారు.
చిరుత బోనులో చిక్కలేదన్నారు. చిరుతలు సాధారణంగా పగటిపూట అడవిలో లోతైన నీడ ఉన్న ప్రదేశాల్లో నిద్రపోతాయని, రాత్రి వేట కోసం బయలుదేరుతాయన్నారు. చిరుతను ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టుకుంటామని ఆయన దీమా వ్యక్తం చేశారు. జిల్లాలో చిరుత సంచారంతో రాంకంద, రంకా, భండారియా అనే మూడు బ్లాకుల్లోని 50కి పైగా గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. రాత్రివేళ ఎవ్వరూ బయటకు వెళ్లవద్దని అటవీశాఖ అధికారులు గ్రామస్తులకు సూచించారు.