సిటీబ్యూరో, ఆగస్టు 24(నమస్తే తెలంగాణ) : హెచ్ఎండీఏ చేపట్టిన మోకిల భూముల వేలం కాసులు కురిపించింది. రెండు సెషన్లలో జరిగిన ఈ వేలంలో 60 ప్లాట్లను విక్రయించగా రూ. 131.72 కోట్ల రెవెన్యూ వచ్చింది. కొనుగోలుదారుల నుంచి రెండు రోజులు విశేష ఆదరణ ఉండగా… సగటున గజం ధర రూ. 62,948 పలికింది. రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి మండలం మోకిల ప్రాంతంలో హెచ్ఎండీఏ దాదాపు 165 ఎకరాల విస్తీర్ణంలో 300 గజాల చొప్పున 1,321 ప్లాట్లతో రెసిడెన్షియల్ లే అవుట్ను రూపొందించింది.
ఐటీ కారిడార్కు సమీపంలో, అభివృద్ధి చెందిన ప్రాంతంలో మోకిల ఉండటంతో… ప్లాట్ల కొనుగోలుకు జనాలు ఆసక్తి చూపారు. గురువారం ఉదయం 30 ప్లాట్లకు వేలం నిర్వహించగా, అన్ని ప్లాట్లు అమ్ముడుపోయాయి. ఉదయం జరిగిన వేలంలో గజం ధర అత్యధికంగా రూ. 72 వేలు పలికితే, కనిష్ఠంగా రూ. 56,600 వరకు అమ్ముడైంది. అలాగే మధ్యాహ్నం నిర్వహించిన 30 ప్లాట్ల వేలంలో అత్యధికంగా గజం ధర రూ. 75వేలు పలుకగా, కనిష్ఠంగా గజం ధర రూ. 56,600 వరకు కొనుగోలు చేశారు. మొత్తంగా మోకిలలో 60 ప్లాట్ల అమ్మకం ద్వారా రూ. 131.72 కోట్ల రెవెన్యూ వచ్చింది. శుక్రవారం మరో 60 ప్లాట్లకు ఈ వేలంగా నిర్వహించనుండగా, ఈ నెల 28, 29వ తేదీన 120 ప్లాట్లను వేలంలో అమ్మకానికి పెట్టారు.