సిటీబ్యూరో, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : పనిచేస్తున్న సంస్థకు కన్నం వేసి బంగారు ఆభరణాలతో పశ్చిమబెంగాల్కు ఉడాయించిన నలుగురు నిందితులను అబిడ్స్ పోలీసులు 48 గంటల్లో అరెస్ట్ చేసి, రూ.1.05 కోట్ల విలువైన సొత్తును రికవరీ చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు గురువారం బషీర్బాగ్లోని సీసీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అబిడ్స్ ముబారక్ బజార్లో ఆర్వీజే ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో గోపాల కృష్ణ డైరెక్టర్గా బంగారు అభరణాల దుకాణం నడుపుతున్నాడు. అయితే ఈ నెల 18న తన వద్ద పనిచేసే పశ్చిమబెంగాల్, హౌరా జిల్లాకు చెందిన హిమాన్షు సర్దార్, కార్తీక్ బాగ్లకు 779.5 గ్రాముల బంగారు, వజ్రా ఆభరణాలను అప్పగించి వాటికి ముత్యాలు పొదిగించాలని తెలిపాడు.
అయితే ఈ ఇద్దరు తమ స్వస్థలానికి చెందిన మహదెబ్ సర్దార్, ఉత్తమ్ల సహకారంతో ఆభరణాలను తీసుకొని తమ స్వస్థలానికి పరారయ్యారు. పనిచేసే వర్కర్లు సాయంత్రం వరకు కన్పించకపోవడంతో యజమాని వారికి ఫోన్ చేశాడు. స్విచాఫ్ రావడంతో ఆభరణాలతో పరారైనట్లు గుర్తించిన గోపాల కృష్ణ అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అబిడ్స్ ఏసీపీ కె.పూర్ణచందర్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్ ప్రసాద్రావు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అభిలాష్ దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఎస్సైలు గౌరేందర్గౌడ్, నిరంజన్ల ఆధ్వర్యంలోని బృందం ఈ నెల 20న నిందితులలో ఒకరైన కార్తీక్ బాగ్ను అదుపులోకి తీసుకొని అతడి వద్ద ఉన్న కొట్టేసిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో మిగతా ముగ్గురిని అరెస్ట్ చేసి నగరానికి తరలించారు. జ్యువెలరీ దుకాణంలో కార్తీక్ మూడు నెలల నుంచి పనిచేస్తుండగా, మిగతా ముగ్గురు ఐదేండ్ల నుంచి పనిచేస్తున్నారు.