ఈజ్ ఇట్ ఇండియా
ఇటీవల ఫాక్స్కాన్ చైర్మన్ హైదరాబాద్కు వచ్చినప్పుడు ఎయిర్పోర్టు నుంచి ఆయన్ను కొంగరకలాన్కు తీసుకెళ్లి, అక్కడి నుంచి ప్రగతి భవన్కు తీసుకువచ్చాం. నగర అభివృద్ధిని కండ్లారా చూసిన ఆయన ముఖ్యమంత్రితో ఇది భారతదేశమేనా ? అని సందేహం వచ్చిందని చెప్పారు. కొంగరకలాన్లో ఆ సంస్థ పెట్టుబడులు పెట్టడం ద్వారా 30 వేల మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది. హైదరాబాద్ ఎంతగా అభివృద్ధి చెందిందో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం.
– మంత్రి కేటీఆర్
పాశ్చాత్య నగరాలను తలదన్నేలా ఈ ఎనిమిదేండ్లలో హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, ఇంకా చేయాల్సింది చాలా ఉందని ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ చెప్పారు. మంగళవారం నగరంలోని ఖాజాగూడ పెద్ద చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి, అనంతరం 51 చెరువుల అభివృద్ధి, సుందరీకరణకు ముందుకు వచ్చిన నిర్మాణ రంగ సంస్థలకు ఎంవోయూ పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలో ప్రజా రవాణాకు 500 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తున్నామని, అలాగే 250 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రూ. 2,400 కోట్లతో లింక్ రోడ్లు, రూ. 10 వేల కోట్లతో మూసీ ఎక్స్ ప్రెస్ వే నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రపంచం అబ్బురపడేలా రాచకొండలో ఫిలిం సిటీ, ఒలింపిక్ స్థాయిలో స్పోర్ట్స్ సిటీని నిర్మిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా 51 చెరువులను అభివృద్ధి చేయడానికి ముందుకువచ్చిన నిర్మాణ రంగ సంస్థలకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
సిటీబ్యూరో, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : అత్యాధునిక వసతులతో చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు. కుటుంబ సమేతంగా సేద తీరడానికి అనువుగా చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్) నిధులతో జీహెచ్ఎంసీ పరిధిలోని 26, హెచ్ఎండీఏ పరిధిలోని 25 చెరువుల అభివృద్ధికి చేయూతనిచ్చాయి. ఈ మేరకు మంగళవారం ఖాజాగూడ లేక్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న వివిధ నిర్మాణ రంగ సంస్థల ప్రతినిధులకు ఒప్పంద పత్రాలను అందజేశారు. సర్కారును స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని నిర్మాణ రంగ సంస్థలు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ కోరారు.
గ్రేటర్ పరిధిలో ఒకవైపు ప్రభుత్వపరంగా జరుగుతున్న చెరువుల అభివృద్ధితో స్ఫూర్తి పొందిన పలు కార్పొరేట్ సంస్థలు, నిర్మాణ రంగ సంస్థలు తమ సొంత నిధులతో పలు చెరువులను అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) కింద 51 చెరువుల అభివృద్ధి పనులు చేపట్టేందుకు సన్నద్ధమయ్యారు. కాగా చెరువుల అభివృద్ధిలో భాగంగా వాకింగ్ ట్రాక్, బెంచీలు, ఓపెన్ జిమ్స్, టాయిలెట్లు, లైటింగ్ సదుపాయం, పిల్లల గేమింగ్ జోన్, కాన్సెప్ట్ థీమ్ పార్కు, గెజిబోలు, సెక్యూరిటీ రూం, అంపిథియేటర్ తదితర సౌకర్యాలను సమకూర్చనున్నారు. ఇందుకోసం ఒక్కో నిర్మాణ సంస్థ కోటి నుంచి రూ.15 కోట్లు వరకు సంబంధిత నిర్మాణ సంస్థ ఖర్చు చేయనున్నది.
ఎన్జీవోలు, కార్పొరేట్ కంపెనీలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్స్, హెల్త్ ఆర్గనైజర్స్ తదితర ముందుకొచ్చే సంస్థలతో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ శాఖలు ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకుంటారు. తొలుత మూడేండ్ల పాటు లీజుకు ఇస్తారు. పరిరక్షణ, సుందరీకరణ పనులు భేషుగ్గా ఉంటే గడువు మరో రెండేళ్లపాటు పొడిగిస్తారు.
ఆయా చెరువులు కబ్జాలకు గురి కాకుండా పరిరక్షణ చర్యలు చేపట్టాలి. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలను సమన్వయం చేసుకుంటూ ఎఫ్టీఎల్, బఫర్ జోన్, ఇన్లెట్ ఛానెల్స్పై ప్రత్యేక దృష్టి సారించాలి. ఎగువ ప్రాంతాల నుంచి ఎలాంటి వ్యర్థాలు చేరకుండా చూడాలి. నీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలి. అక్రమ కట్టడాలపై అధికారులకు సమాచారం అందించాలి. చెత్తాచెదారం లాంటి డంపింగ్లు ఉండొద్దు. అతి ముఖ్యంగా ఎలాంటి వాణిజ్య వ్యాపారాలు చేపట్టరాదు.