ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ అవగాహన కల్పించినా గ్రేటర్ ఓటరు మారలేదు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల వారీగా మొత్తం ఓటింగ్ను పరిశీలిస్తే 2018 అసెంబ్లీ ఎన్నికల కంటే గణనీయంగా తగ్గింది. బస్తీ ఓటర్లు మినహా నగరంలో యువకులు, విజ్ఞానవంతులు ఓటు హక్కును వినియోగించుకోలేదు. తెలంగాణలో మూడు సార్లు జరిగిన ఓటింగ్ సరళిని గమనిస్తే హైదరాబాద్, చుట్టూరా ఉన్న జిల్లాల్లోనే తక్కువగా ఉండగా, తాజా ఓటింగ్ కూడా 50శాతం లోపే ఉంది. పాత నగరంలోని పలు నియోజకవర్గాలతోపాటు, కోర్ సిటీలోనూ ఇదే తరహా పోలింగ్ శాతం నమోదు కావడం ప్రతి ఎన్నికలలో సర్వసాధారణంగా మారింది.
– సిటీబ్యూరో, నవంబర్ 30(నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, నవంబర్ 30(నమస్తే తెలంగాణ): గురువారం జరిగిన శాసన సభ ఎన్నికలను గత ఎన్నికలతో పోల్చుకుంటే నగర ఓటర్లలో పెద్దగా మార్పు కన్పించడం లేదు. తీరు మారని ఓటరు సెలవు దినాన్ని ఎంజాయ్ చేస్తూ ఇళ్లకే పరిమితమయ్యారు. మొత్తం ఓటర్లతో పోల్చితే పోలింగ్ కేంద్రాలకు వచ్చే సంఖ్య గణనీయంగా తగ్గింది. తెలంగాణలో మూడుసార్లు జరిగిన ఓటింగ్ సరళిని గమనిస్తే గ్రేటర్ చుట్టూరా ఉన్న జిల్లాల్లోనే తక్కువగా ఉండగా, తాజా గ్రేటర్ లో ఓటింగ్ 49.03 శాతం ఉంది. హైదరా బాద్ జిల్లా వ్యాప్తంగా 46.56, రంగారెడ్డి జిల్లా పరిధిలో 59.94, మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 56 శాతం ఓటింగ్ నమోదైంది.
గ్రేటర్ వ్యాప్తంగా నమోదైతున్న ఓటింగ్ సరళిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ఓటు హ క్కు ప్రాధాన్యతను వివరిస్తున్నా హైదరాబాద్లోనే ఓటు వేసేందుకు గడప దాటడం లేదు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా, గతంలో అతి తక్కువ పోలింగ్ నమోదైన నియోజకవర్గాలపై మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇందులో ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉంటుందే.. కానీ, పోలింగ్ రోజున ఆ ఓటు వినియోగంలోకి రావడం లేదు. కోర్ సిటీతో పాటు, హైదరాబాద్ చుట్టూరా ఉన్న అన్ని జిల్లాల్లోనూ ఇదే తరహా ట్రెండ్ నడుస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది.
2014 నుంచి ఇదీ మూడో ఎన్నిక. 2014, 2018లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2019లో జీహెచ్ఎంసీ, 2019 లోక్ సభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో ఓటింగ్ సరళిని గమనిస్తే… ప్రతి ఎన్నికల్లోనూ పెద్ద మార్పు ఉండటం లేదు. సగటున 55 శాతం లోపే ఓటింగ్ నమోదు కావడం పలు నియోజకవర్గాల్లో సర్వసాధారణంగా మారింది. హైదరాబాద్ జిల్లాల్లో మొత్తం 15 నియోజకవర్గాలు ఉండగా, 2014లో సగటున 51.5 శాతం, 2018లో 50.3 శాతం మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు.
హైదరాబాద్ చుట్టూరా ఉన్న రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల వారీ ఓటింగ్ సరళిని పరిశీలిస్తే… 2018 కంటే గణనీయంగా తగ్గింది. సాయంత్రం ఐదున్నర గంటల వరకు విడుదల చేసిన జాబితా ప్రకారం 23 నియోజకవర్గాల సగటు గతం కంటే 10-15 శాతం తక్కువగా నమోదైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఓటరు గడప దాటకపోవడంతో చివరి వరకు కూడా ఓటింగ్ శాతం ఏమాత్రం పెరగడం లేదు. ఇక గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈసారి తక్కువ ఓటింగ్ శాతం తక్కువగా ఉండటం ఎన్నికల అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
గ్రేటర్ వ్యాప్తంగా 49.03 శాతం దాటని ఓటింగ్