సిటీబ్యూరో, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : మహబూబ్నగర్ జిల్లా ముద్దుబిడ్డ, సామాజిక ఉద్యమాల ఉపాధ్యాయుడు, శ్రీశ్రీతో కలిసి సాహిత్య జీవితాన్ని గడిపిన నాయకుడు రామ్మోహన్ (74) మంగళవారం ఉదయం వనస్థలిపురం సత్యసాగర్ కాలనీలో తుదిశ్వాస విడిచారు. ఆయన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని గోపాల్పేట సంస్థానంలోని మఖ్త గ్రామం కదిరెపాడులో 1948లో జన్మించారు. పాఠశాల విద్య వనపర్తి, కొల్లాపూర్, మహబూబ్నగర్లలో సాగింది. మోడల్ బేసిక్ ఉన్నత పాఠశాలలో జూనియర్ తెలుగు పండిట్గా చేరి 1969 నుంచి 1986 వరకు పనిచేసి ఎందరో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దారు. అనంతరం పదోన్నతితో మెదక్ జూనియర్ కళాశాలకు బదిలీ అయ్యారు. అక్కడి నుంచి నగరంలోని సరూర్నగర్, రాజేంద్రనగర్, శంషాబాద్ జూనియర్ కాలేజీల్లో పనిచేశారు. 2006 జూన్లో పదవీ విరమణ పొందారు.
ఉద్యమాల ఉపాధ్యాయుడిగా పేరు..
తన జీవితమంతా ఉద్యమాలతోనే గడిచిందని రామ్మోహన్ స్నేహితులు పేర్కొన్నారు. 1969లో తొలిదశ తెలంగాణ ఉద్యమంలో మహబూబ్నగర్ పట్టణంలో క్రియాశీలక పాత్ర పోషించారు. మహాకవి శ్రీశ్రీతో కలిసి సాహిత్య జీవితాన్ని పంచుకున్నారు. న్యూ థింకర్స్ ఫోరం, రాష్ర్ట ఉపాధ్యాయ సంఘం, ఏపీటీఎఫ్ సంఘాల విస్తరణలో క్రియాశీలకంగా పనిచేశారు. విప్లవ రచయితగా ప్రజలను చైతన్యం చేసే రచనలు చేశారు. పాలమూరు అధ్యయన వేదికలో క్రియాశీల నాయకుడిగా పని చేశారు. అక్కడి ప్రజల వలస బతుకులు, దీనగాథను ప్రపంచానికి ఎలుగెత్తి వినిపించిన తొలి ఉపాధ్యాయుడు కామ్రేడ్ రామ్మోహన్ అని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవా చారి పేర్కొన్నారు.