సిటీబ్యూరో, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ఎప్పుడెప్పుడా అని నిరుద్యోగులు ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. పుస్తకాలతో కుస్తీపడి ఉద్యోగాలు సాధించే సమయం ఆసన్నమైంది. దీంతో అశోక్నగర్లోని వట్టికోట అళ్వారు స్వామి సిటీ సెంట్రల్ లైబ్రరీ చదువరులకు వేదికైంది. పట్టుదలతో చదివేందుకు విద్యార్థులు, నిరుద్యోగులు గ్రంథాయం బాట పట్టారు. నిత్యం మూడువేల మంది కూర్చొని చదివేందుకు అవకాశం ఉన్న ఈ గ్రంథాలయంలో ఏ పుస్తకం కావాలన్నా అందుబాటులో ఉండటంతో నిరుద్యోగులు ఇక్కడికి బారు లు తీరుతున్నారు. పొద్దంతా ఇక్కడే కూర్చోని పుస్తకాలు తిరగేస్తున్నారు. గ్రంథాలయ అధికారులు అదనపు పుస్తకాలను సమకూర్చే పనిలో నిమగ్నమయ్యారు.
రాష్ట్ర కేంద్ర గ్రంథాలయంలో
అఫ్జల్గంజ్లోని రాష్ట్ర కేంద్ర గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం వసతులు కల్పిస్తున్నారు. విద్యార్థులు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు చదువుకునే విధంగా అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచారు. ఉద్యోగాల భర్తీ ప్రకటన రావడంతో లైబ్రరీ సమయం మరింత పెంచనున్నామని అధికారులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు 500 మంది చదువుకునే అవకాశం ఉండగా.. మరో నాలుగు కారిడార్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు ఎంతమంది అభ్యర్థులు లైబ్రరీకి వచ్చినా వసతులు కల్పిస్తామని చెప్పారు. లైబ్రరీలో 32వేల మంది సభ్యత్వం పొంది ఉండగా.. వారికి కార్డు వసతి కల్పించామని, కార్డు ద్వారా ఏవేని రెండు పుస్తకాలు ఇంటికి తీసుకెళ్లేందుకు అనుమతిస్తామని తెలిపారు. 15 రోజుల్లో తిరిగి లైబ్రరీలో అందజేసి మరల వేరే పుస్తకాలు తీసుకువెళ్లే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం లైబ్రరీలో 5 లక్షల పుస్తకాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.
డిమాండ్కు తగ్గట్టుగా పుస్తకాలు
పాఠకుడు అడిగిన పుస్తకాలను వెంటనే అందజేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సిటీ సెంట్రల్ లైబ్రరీ సెక్రెటరీ పొట్లూరి పద్మజ తెలిపారు. ప్రస్తుతం 2 లక్షల పుస్తకాలు అందుబాటులో ఉండగా.. మరో 63 లక్షల పుస్తకాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చామని పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని నూతన పుస్తకాలు వచ్చాయని, వాటిని పంపిణీ చేసేందుకు సిబ్బందికి కేటాయించిన శాఖల వారీగా సర్దుతున్నారని చెప్పారు. ఈ నెల చివరి వారంలోగా పూర్తిస్థాయిలో పుస్తకాల కొనుగోలు పూర్తవ్వగానే.. సిటీ సెంట్రల్ లైబ్రరీ పరిధిలోని 82 గ్రంథాలయ శాఖలకు పుస్తకాలను పంపిణీ చేస్తామని తెలిపారు. అదేవిధంగా విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు పనివేళలుంటాయని, ఎప్పుడు ఏ నోటిఫికేషన్ వచ్చినా విద్యార్థులు, నిరుద్యోగులకు పుస్తకాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
మోండామార్కెట్ లైబ్రరీలో..
సికింద్రాబాద్లోని మోండామార్కెట్ వద్ద రూ.3 కోట్లతో నిర్మించిన లైబ్రరీ భవనం కూడా అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ ఇంటర్నెట్ సెక్షన్తోపాటు చిల్డ్రన్స్ సెక్షన్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ లైబ్రరీలో కూడా ప్రిపేర్ అయ్యేందుకు అన్ని రకాల పుస్తకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఉద్యోగం సాధించడమే లక్ష్యం
ఇప్పటికే దాదాపు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పుస్తకాలు చదివేశా. తిరిగి మళ్లీ చదువుతున్నా. సీఎం కేసీఆర్ కల్పించిన ఈ అవకాశాన్ని ఎట్టిపరిస్థితుల్లో సద్వినియోగం చేసుకుంటా. ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నా.
– కేతావత్ శ్రీనివాస్, అభ్యర్థి
ప్రతి అంశాన్ని నోట్ చేసుకుంటూ..
స్థానికులకే 95 శాతం ఉద్యోగ అవకాశం కల్పించడంతో నమ్మకం పెరిగింది. పట్టుబట్టి చదువుతా. ఎప్పటికప్పుడు ప్రతి అంశాన్ని నోట్ చేసుకుంటూ చదువుతా. సీఎం కేసీఆర్ కల్పించిన ఇంతమంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా.
-కె.సురేంద్ర, అభ్యర్థి
పట్టుదలతో చదువుతున్నా..
లక్షల మంది నిరుద్యోగులు పోటీలో ఉన్నారు. అందరూ పట్టుదలతో చదువుతున్నారు. నేను ఇప్పటికే చదవడం పూర్తిచేశాను. మరలా పుస్తకాలు తిరగేస్తున్నా. రోజురోజుకూ కొత్త అంశాలు తెలుసుకుంటున్నా. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడం కష్టమైన పనే. ఇన్ని ఏండ్ల కష్టానికి ఫలితం లభిస్తుందని ఆశిస్తున్నా.
– సి.అరుణ్కుమార్, అభ్యర్థి
చరిత్రలో నిలిచిపోయేలా ప్రకటన
రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2018లో రూ.కోటీ 6లక్షలతో సిటీ సెంట్రల్ లైబ్రరీ గ్రంథాలయాన్ని అభివృద్ధి చేశాం. లైబ్రరీకి వచ్చే విద్యార్థుల కోసం నీటి సౌకర్యం, మూత్రశాలలు తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. ఎప్పటికప్పుడు సమస్యలను తెలుసుకుంటూ వారి శ్రేయస్సుకు కృషి చేస్తున్నాం. సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయే ప్రకటన చేశారు. ఇది నిజంగా.. నిరుద్యోగులకు శుభవార్త.
– కె.ప్రసన్న, చైర్పర్సన్, సిటీ సెంట్రల్ లైబ్రరీ
సువర్ణావకాశం
సీఎం కేసీఆర్ సువర్ణావకాశం కల్పించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం. ఉద్యోగం సాధించేందుకు చాలా రోజుల నుంచి చదువుతున్నాను. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉద్యోగ ప్రకటన రానేవచ్చింది. నిరుద్యోగులంతా సంతోషంలో ఉన్నారు. వెయ్యికండ్లతో ఎదరు చూశాం. ఇక చదవడమే తరువాయి.
-సురేశ్, ఎంఏ, బీఈడీ, కోదాడ, సూర్యాపేట
ఉద్యోగమే లక్ష్యంగా చదువుతా
ఉద్యోగమే లక్ష్యంగా చదువుతున్నాను. ప్రభుత్వ అధికారిగా సేవలందించాలనే కోరిక బలంగా ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా. ఇప్పటికే తెలుగు అకాడమికి చెందిన పుస్తకాలు చదివేశాను. ఇక రివిజన్ చేసుకోవడమే. ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం ఏర్పడింది.
– స్వేత, ఎంఏ, జనగామ