సిటీబ్యూరో, మార్చి 9 (నమస్తేతెలంగాణ): నగరంలో చారిత్రక విద్యా కేంద్రమైన నిజాం కాలేజీ అభివృద్ధికి ఎన్ని నిధులైనా అందిస్తామని, కళాశాల నిర్వహణలో ఎక్కడా రాజీపడకుండా చూడాలని, అవసరమైతే మరో రూ.15 కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని పురపాలక,ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నిజాం కళాశాల ప్రాంగణంలో రూ.8 కోట్ల వ్యయంతో హెచ్ఎండీఏ నిర్మించిన బాలిక వసతి గృహాన్ని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో బుధవారం కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం భవనంలో తిరుగుతూ వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘నేను నిజాం కాలేజీలోనే చదువుకున్నా. ఇక్కడికొచ్చిన ప్రతిసారి ఎన్నో జ్ఞాపకాలు, సందర్భాలు గుర్తుకొస్తుంటాయి. పూర్వ విద్యార్థిగా నావంతు ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన కలిగింది. క్రితం సారి వచ్చినపుడు బాలికల హాస్టల్ అవసరం ఉందని ప్రిన్సిపాల్ అడిగారు. సుమారు రూ.5 కోట్ల వరకు ఖర్చవుతుందని చెప్పారు.
అత్యాధునిక మౌలిక వసతులతో హాస్టల్ భవనం నిర్మించిన తర్వాత రూ.8 కోట్లు ఖర్చయ్యిందని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ‘మన ఊరు -మనబడి’ కింద కార్యక్రమాన్ని గుర్తుచేస్తూ విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి విన్నపం మేరకు మరో రూ.10 నుంచి రూ.15 కోట్లు ఖర్చు చేసైనా నిజాం కళాశాలను అద్భుతంగా అభివృద్ధి చేస్తాం. కళాశాల ప్రాంగణం ఎంతో విశాలంగా ఉంది. కొత్త భవనాలతోపాటు పాత భవనాలు ఉన్నాయి. ఆధునికంగా కనిపించాలంటే అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. ఈ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, ప్రభాకర్రావు, మేయర్ గద్వాల విజయలక్ష్మి, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బి.ఎల్.ఎన్.రెడ్డి, ఎస్ఈ పరంజ్యోతి, డీఈ దేవేందర్రెడ్డి, నిజాం కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. భవన ప్రారంభోత్సవ తర్వాత గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ విద్యార్థులకు గోల్డ్మెడళ్లు, పట్టాలను ప్రదానం చేశారు.
మీరెంతో అదృష్టవంతులు
రాష్ట్రంలో ఏడున్నరేళ్లుగా ఎంతోమంది ప్రభుత్వోద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. మీరెంతో అదృష్టవంతులు. డిగ్రీ పట్టాలు పుచ్చుకొని బయటకొస్తున్న రోజే ఉద్యోగాల నోటిఫికేషన్ల ప్రకటనలు వచ్చాయి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మంత్రి కేటీఆర్ తన ప్రసంగంలో పలుమార్లు హ్యాపీ నిజామియన్.. ప్రౌడ్ నిజామియన్ అన్నారు.
‘ప్రైవేటు రంగంలోనూ బోలెడు అవకాశాలు’
నేను నిజాం కాలేజీలో చదువుకునే రోజుల్లో కెరీర్పై స్పష్టత ఉండేది కాదు. జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత వాస్తవిక ప్రపంచం ఏమిటో తెలుస్తుంది. ఇక్కడున్న విద్యార్థులకు విజ్ఞప్తి ఏమంటే..డిగ్రీలు తీసుకున్న తర్వాత ఉద్యోగాల కోసం మాత్రమే ప్రయత్నం చేయకండి. చదివిన చదువుకు తగ్గట్టుగా, మీ కష్టానికి ఫలితంగా ఉద్యోగమైతే వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగమే కాదు. ప్రైవేటు రంగంలోనూ ఎన్నో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. అద్భుత ఆవిష్కరణలు చేసే విద్యార్థులు ఉన్నారు. అలా చేస్తే మీరు ఇతరులకు ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదుగుతారు. భారత్కు చెందిన వారే ఇప్పుడు ప్రపంచంలోని టాప్ కంపెనీల సీఈవోలుగా ఉన్నారు. మైక్రోసాప్ట్,గూగుల్,ఐబీఎం..ఇలా ప్రపంచస్థాయి కంపెనీల సీఈవోలు మన భారతీయులే.
ఈ తరానికి చాలా స్పష్టత ఉంది..
నేను ఇదే కాలేజీలో బీఎస్సీ మైక్రోబయోలజీ చదివిన. ఆ సమయంలో చదువు పట్ల సీరియస్గా లేను. మాస్టర్డిగ్రీ పూర్తిచేశాను. నాకు పెద్దగా లక్ష్యం అంటూ లేకపోయింది. కానీ ప్రస్తుతం మీకు మంచి అవకాశం ఉంది. నేను డిగ్రీ చదువుతున్న సమయంలో ఉన్నదానికంటే ఇప్పుడు నా పిల్లలు భవిష్యత్తులో ఏం చేయాలి, ఏం కావాలన్న దానిపై ఎంతో స్పష్టతతో ఉన్నారు.
నిజాం కాలేజీ విద్యార్థులకు అద్భుత అవకాశం
నిజాం కళాశాల విద్యార్థులు డిగ్రీ పట్టాలు తీసుకొని బయటకెళ్తున్న రోజే 90వేలకు పైగా ఉద్యోగాల ప్రకటన వచ్చింది. మంచి అవకాశంగా భావించి ఉద్యోగాలను సొంతం చేసుకోవాలి. నిజాం కళాశాల అంటే ఎంతో గర్వంగా భావిస్తుంటారు. అలాంటి కళాశాలలోనే మంత్రి కేటీఆర్ చదివారు. అలాంటి వ్యక్తి కళాశాల అభివృద్ధి కోసం ఎంతో చేస్తున్నారు. ఇంకా ఎంతో చేస్తారు.
మహబూబియా బాలికల పాఠశాల సందర్శన
ప్రతిష్టాత్మక ‘మన ఊరు-మనబడి’ పథకంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలే పూర్తిగా మారిపోతాయని మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో కలిసి పరికరాలకు సంబంధించిన ఎగ్జిబిషన్ను మంత్రి పర్యవేక్షించారు. దీంతోపాటు ఈ పథకం పనులను ప్రయోగాత్మకంగా చేపట్టిన మహబూబియా బాలికల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాణ్యమైన విద్య, బోధన, నాణ్యతతో కూడిన మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా రాష్ట్రంలో నూతన విద్యా విధానాన్ని అమలు చేయబోతున్నామన్నారు. నూతన విద్యా విధానం వల్ల ఉపాధ్యాయులకు, పిల్లలకు మేలు జరుగుతుందన్నారు. పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు 12 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు.
తండ్రి స్మారకార్థం గోల్డ్మెడల్ అందజేత
నిజాం కళాశాల పూర్వవిద్యార్థిని వేముల రాధికతన తండ్రి దివంగత వేముల సురేందర్రెడ్డి స్మారక గోల్డ్మెడల్ను కాలేజీలోని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి అందజేశారు. కళాశాల చరిత్రలో మొట్టమొదటి సారిగా గ్రాడ్యుయేషన్డే సందర్భంగా గోల్డ్మెడల్ను ఆమె మంత్రులు కేటీఆర్, సబితారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.లింబాద్రి, ఓయూ వీసీ ప్రొ.రవీందర్ఆధ్వర్యంలో అందజేశారు.