కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 28 : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు జీహెచ్ఎంసీ ప్రకటించిన ఎర్లీబర్డ్ ఆఫర్ రేపటితో ముగుస్తుంది. ఎర్లీబర్డ్ ఆఫర్లో భాగంగా ఏప్రిల్ 30లోగా ఈ యేడాదికి సంబంధించిన ఆస్తిపన్నును చెల్లించిన వారికి ఐదుశాతం రాయితీ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. గడువులోగా ఆస్తిపన్ను చెల్లించి రాయితీని పొందేందుకు భవనాలకు చెందిన యజమానులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆన్లైన్లో, మీసేవా కేంద్రాలు, సీఎస్ఈ కేంద్రాలతో పాటు బిల్ కలెక్టర్లకు ఆస్తిపన్ను చెల్లిస్తూ రాయితీని పొందుతున్నారు. కాగా ఆస్తిపన్ను రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులు విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తూ ఆఫర్ను వినియోగించుకుంటున్నారు. గతేడాది ఎర్లీబర్డ్లో పన్నులు చెల్లించిన వారికి సమాచారానిస్తూ ఈ యేడాది కూడా పన్నులు చెల్లించేలా ప్రోత్సహిస్తున్నారు. రేపటితో ఆఫర్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో భవనాల యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.
జోన్లో రూ.84.87 కోట్ల వసూళ్లు..
కూకట్పల్లి జోన్ పరిధిలో మూసాపేట, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, గాజులరామారం, అల్వాల్ సర్కిళ్లకు గాను ఎర్లీబర్డ్ ఆఫర్ లక్ష్యాన్ని రూ.107.93 కోట్లుగా జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు నిర్దేశించారు. ఇప్పటి వరకు జోన్ పరిధిలో నిర్దేశించిన లక్ష్యంలో రూ.84.87 కోట్లు వసూళ్లు కాగా మరో 17.06 కోట్లు వసూళ్లు చేయాల్సి ఉంది. సర్కిళ్ల వారీగా పరిశీలిస్తే మూసాపేట సర్కిల్ లక్ష్యం రూ.40.09 కోట్లు కాగా రూ.32.83 కోట్లు, కూకట్పల్లి సర్కిల్ లక్ష్యం రూ.35.02 కోట్లు కాగా రూ.22.27 కోట్లు, కుత్బుల్లాపూర్ సర్కిల్ లక్ష్యం రూ.14.10 కోట్లు కాగా రూ.12.17 కోట్లు, గాజులరామారం సర్కిల్ లక్ష్యం రూ.8.72 కోట్లు కాగా రూ.7.61 కోట్లు, అల్వాల్ సర్కిల్ లక్ష్యం రూ.10 కోట్లు కాగా రూ.9.97 కోట్లు వసూళ్లయ్యాయి. మరో రెండ్రోజుల్లో ఎర్లీబర్డ్ ఆఫర్ లక్ష్యాన్ని సాధించే దిశగా జీహెచ్ఎంసీ రెవెన్యూ సిబ్బంది కసరత్తు చేస్తున్నారు.
సకాలంలో పన్నులు చెల్లించాలి..
ఎర్లీబర్డ్ ఆఫర్ రేపటితో ముగుస్తుంది. ఆస్తిపన్నులో ఐదుశాతం రాయితీని పొందాలంటే రేపటి సాయంత్రం లోగా పన్నులు చెల్లించాలి. సీఎస్ఈ, ఆన్లైన్, మీసేవా కేంద్రాల్లో ఆస్తిపన్నులు చెల్లించే అవకాశముంది. ఉన్నతాధికారులు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పన్నులు చెల్లించని మొండి బకాయిలపై చట్టరీత్యా చర్యలు తప్పవు. సకాలంలో పన్నులు చెల్లించి నగరాభివృద్ధిలో భాగస్తులు కావాలని కోరుతున్నాం.
-వి.మమత, జడ్సీ, కూకట్పల్లి జోన్