శేరిలింగంపల్లి, నవంబర్ 28: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నలగండ్ల లక్ష్మీవిహార్ ఫేజ్-1లో కాలనీ వాసులు ఆదివారం కార్తికమాస వనభోజన మహోత్సవం ఏర్పాటు చేశారు. ఆదివారం కాలనీవాసులు అందరూ కలిసి ఆటపాటలతో సందడి చేశారు. సహపక్తి భోజనాలు చేసి కుటుంబసభ్యులతో ఆహ్లాదంగా గడిపారు. వివిధ క్రీడా, సాంస్కృతి పోటిల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అరెకపూడి గాంధీ వివిధ క్రీడా, సంస్కృతిక పోటిల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. పరిశుభ్రత, పచ్చదనంను పెంపొందించుకునేందుకు కాలనీ సంక్షేమ సంఘాలు ప్రత్యేకంగా కృషి చేయాలన్నారు. స్వచ్ఛ కాలనీలుగా తీర్చిదిద్దడంతో తగిన సహాయ సహకారాలు అందించాలని పేర్కొన్నారు. కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, పలువురు స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పాపిరెడ్డికాలనీలో..
శేరిలింగంపల్లి డివిజన్లోని పాపిరెడ్డికాలనీలో ఆదివారం కార్తికమాస వనభోజన మహోత్సవం నిర్వహించారు. శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముగ్గులపోటిల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వివేకానందనగర్లో..
వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని సప్తగిరి కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్తిక వన భోజన కార్యక్రమంలో కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి, ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావులతో కలిసి విప్ అరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీ వాసులంతా ఒకే వేదికపై పవిత్ర కార్తికమాసం సందర్భంగా కలుసుకోవడం శుభ పరిణామమని, ఈ తరహా సాంప్రదాయాలు ప్రజలలో భక్తి భావంతో పాటు సత్సంబంధాల పెంపునకు ఉపయుక్తం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సంజీవరెడ్డి, కాలనీ వాసులు శర్మ, మాలయ్య, రాజేశ్ శ్రవణ్ పాల్గొన్నారు.