అమీర్పేట్, నవంబర్ 28 : సనత్నగర్ జెక్కాలనీలో నెలకొన్న సమస్యల ప్రస్తావన.. వాటి పరిష్కారం వంటి అంశాల్లో కాలనీ నివాసితులంతా భాగస్వాములు కావాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సూచించారు. ఆదివారం జెక్కాలనీ స్ట్రీట్ నంబర్ 1లోని క్లాసిక్ ఆర్కేడ్లో కాలనీ నివాసితులు ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి తలసాని, కార్పొరేటర్ కొలను లక్ష్మీరెడ్డి హాజరయ్యారు. సమస్యలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశానికి కాలనీ నివాసితులు తక్కువ సంఖ్యలో హాజరు కావడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి ఇంటి నుంచి ఓ వ్యక్తి ముందుకు వస్తే ఎంతటి సమస్య అయినా పరిష్కారమవుతుందన్నారు. కామన్ ఏరియా, ఎర్రగడ్డ పశువుల సంత వల్ల ఇబ్బందులు వంటి అనేక అంశాలున్నాయని వాటి పరిష్కారానికి తన సహకారం ఉంటుందని తెలిపారు.
వచ్చే నెల 18న సమావేశం ..
వచ్చే నెల 18న జిల్లా స్థాయిలో అన్ని విభాగాల యంత్రాంగాలతో కలిసి జెక్కాలనీలో సమస్యల పరిష్కారానికి సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఒకరు వచ్చి తమ సమస్యలు ప్రస్తావించాలన్నారు. ఎక్కడా నిధుల లోటు లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాలనీ ఫెడరేషన్ అధ్యక్ష, కార్యదర్శులు సూర్యశంకర్రెడ్డి, డాక్టర్ మల్లు ప్రసాద్లు కాలనీ సమస్యలపై మంత్రి తలసానికి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ వై.వి.రాఘవయ్య పాల్గొన్నారు.