కందుకూరు, మార్చి 14: రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతిలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీలకు అనేక వసతులను కల్పిస్తున్నది. ఇందులో భాగంగానే ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ కొనుగోలు చేయాలని ఆదేశించింది. సర్పంచ్, కార్యదర్శులు గ్రామ జనాభా ఆధారంగా ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. పంచాయతీల ట్రాక్టర్ల ద్వారా గ్రామంలో చెత్తా చెదారాన్ని తరలించడం వంటి పనులు చేపడుతున్నారు. ప్రతి రోజూ గ్రామంలో ట్రాక్టర్ ఎన్ని కిలో మీటర్లు తిరుగుతున్నది.. అన్న విషయాన్ని తెలుసుకునేందుకు ప్రభుత్వం ట్రాక్టర్లకు జీపీఎస్ను అమర్చింది.
అక్రమాలకు అడ్డుకట్ట ..
కందుకూరు, మహేశ్వరం, కడ్తాల్, ఆమనగల్లు, తలకొండపల్లి ఐదు మండలాల్లోని 135 గ్రామ పంచాయతీలకు నూతనంగా ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. గ్రామ పంచాయతీ ద్వారా కొనుగోలు చేసిన ఈ ట్రాక్టర్లతో కొంతమంది సర్పంచులు సొంత పనులకు ఉపయోగించుకుంటున్నారని అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ ట్రాక్టర్లకు జీపీఎస్ విధానాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలో ట్రాక్టర్ ఎక్కడ తిరుగుతున్నది.. ఎన్ని కిలో మీటర్లు తిరిగింది.. అనే విషయాన్ని జీపీఎస్ ద్వారా జిల్లా పంచాయతీ కార్యాలయానికి చేరుతుంది. ఎవరైనా ట్రాక్టర్ను ఇతర పనులకు ఉపయోగిస్తే బిల్లులు చెల్లించకపోగా, సదరు సర్పంచులపై చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.
పంచాయతీకి వినియోగిస్తున్నాం..
ప్రభుత్వ ఆదేశాలతో ట్రాక్టర్లను కొనుగోలు చేశాం. సొంత పనులకు వాడుకోకుండా పంచాయతీ పనులకు మాత్రమే వాడుతున్నాం. చెత్త సేకరణ, మొక్కలకు నీరు అందించడం వంటి పనులకు వినియోగిస్తున్నాం. అక్రమాలకు తావులేకుండా ప్రతి నిత్యం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జీపీఎస్ ఏర్పాటు చేయడం మంచి నిర్ణయం
– పల్లె వసంత కృష్ణగౌడ్, సర్పంచ్ కొత్తూరు
అన్ని ట్రాక్టర్లకు జీపీఎస్
కందుకూరు, మహేశ్వరం, కడ్తాల్, ఆమనగల్లు, తలకొండపల్లి మండలాల్లోని 135 గ్రామ పంచాయతీలకు జీపీఎస్ను ఏర్పాటు చేశాము. డివిజన్లో ఎక్కడ కూడా పంచాయతీ ట్రాక్టర్ను సొంత పనులకు వాడటంలేదు. ఎక్కడైనా ట్రాక్టర్ను ఇతరత్ర పనులకు వినియోగిస్తే చర్యలు తీసుకుంటాం. ట్రాక్టర్లపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాతుంది.
– అమృత, డీఎల్పీవో కందుకూరు