కీసర, మార్చి 14 : పేద ప్రజలకు సీఎం సహాయనిధి భరోసానిస్తున్నదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని గోధుమకుంట గ్రామానికి చెందిన మంచాల యాదగిరి వైద్య సహాయ నిమిత్తం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా రూ.60వేల చెక్కు మంజూరైంది. ఈ చెక్కును మంత్రి మల్లారెడ్డి లబ్ధిదారుడికి సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరవాతే బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వ పరంగా వచ్చే అన్ని స్కీంలు అందుతున్నాయని తెలిపారు. జిల్లాలో దరఖాస్తు చేసుకొన్నవారందరికీ ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందజేశామని చెప్పారు. గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ సభ్యులు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆకిటి మహేందర్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు కృష్ణ, జిల్లా కురుమ సంఘం అధ్యక్షుడు సురేశ్ పలువురు పాల్గొన్నారు.
గుండ్లపోచంపల్లికి చెందిన ఒకరికి..
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీకి చెందిన కళమ్మ వైద్య సహాయ నిమిత్తం చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి సహకారంతో సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆమెకు రూ.30వేలు చెక్కు మంజూరైంది. ఈ చెక్కును మున్సిపాలిటీ కార్యాలయంలో లబ్ధిదారుడికి సోమవారం అందజేశారు. మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు జైపాల్ రెడ్డి, హేమంత్ రెడ్డి, నాయకులు సురేందర్ గౌడ్, సుధాకర్, ఫిలిప్స్, శ్రీహరి పాల్గొన్నారు.