ఖైరతాబాద్, మార్చి 4 : స్వచ్ఛ నగరమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ అనేక వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నది. సిటీలోని పలుకాలనీలు, బస్తీల్లో డంపర్ బిన్లు తొలగించి నిత్యం చెత్తసేకరణ కోసం ఆటో టిప్పర్లను ఇంటి వద్దకే పంపుతూ పారిశుధ్యానికి పెద్ద పీట వేశారు. ప్రస్తుతం తడి, పొడి చెత్తతో పాటు బయో వెస్టేజ్ సేకరణ నిరాటకంగా కొనసాగుతున్నది. తాజాగా ఇంట్లోని పాత సామాన్లు, నిరూపయోగంగా ఉన్న వస్తువులను సేకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గతంలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టగా కరోనా, లాక్డౌన్ల నేపథ్యంలో బ్రేక్ పడింది. తిరిగి దీనిని పునరుద్ధరించే చర్యలు చేపట్టారు.
ప్రతి ఆదివారం..
సర్కిల్ 17 పరిధిలో ఖైరతాబాద్, సోమాజిగూడ, అమీర్పేట్, సనత్నగర్ డివిజన్లలో మొత్తం 112 కాలనీలు ఉన్నాయి. పాత వస్తువులను సేకరించేందుకు కాలనీకో టిప్పర్ చొప్పున నాలుగు కేటాయించారు. ఆయా కాలనీలు అందులోని బస్తీలకు వెళ్లి పాత వస్తువులను సేకరిస్తారు. అందులో ప్లాస్టిక్, ఇతర రీసైకిల్ అయ్యే వాటిని వేరు చేసి వాటిని ఆయా కేంద్రాలకు తరలిస్తారు. మిగతా వాటిని జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డులకు తరలిస్తారు. ప్రతి ఆదివారం ఖైరతాబాద్ సర్కిల్ 17 పరిధిలో ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నారు.
ప్రజలు సహకరించాలి
ప్రతి ఇంట్లో నిత్యావసర వస్తువులతో పాటు గృహోపకరాలైన ఫ్యాన్లు, ప్లాస్టిక్, కలప కుర్చీలు, ఫ్రిడ్జ్లు, కూలర్లు, టీవీలు ఉంటాయి. అయితే వాటిలో పాడైన వాటిని ఇంటి ఆవరణలో లేక ఇంట్లోనే ఓ మూలన పెడుతారు. దీంతో అక్కడ చెత్తాచెదారం పేరుకుపోయే అవకాశం ఉంది. మరికొందరు వాటిని నాలాలు, రోడ్లపై వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటిని నేరుగా సేకరించి సంపూర్ణ స్వచ్ఛత కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. నేడు సర్కిల్లోని దుర్గానగర్, అమీర్పేటలోని మెథడిస్ట్ కాలనీ, సోమాజిగూడలో శాలివాహన నగర్, సనత్నగర్లో మోడల్ కాలనీలో పాత వస్తువుల సేకరణ డ్రైవ్ చేపడుతున్నాం. సిబ్బందికి ప్రజలు సహకరించాలి.
-భార్గవ్ నారాయణ, ఏఎంవోహెచ్ సర్కిల్ 17