సిటీబ్యూరో, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): చిన్న పిల్లలతో ముఠాను ఏర్పాటు చేసి దొంగతనాలు, దోపిడీలకు పాల్పడి నల్లగొండ పోలీసులకు చిక్కిన హైదరాబాద్ కమిషనరేట్కు చెందిన కానిస్టేబుల్ మేకల ఈశ్వర్ను ఉద్యోగంలో నుంచి తొలగిస్తూ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. గతంలో వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్లో పనిచేస్తున్న సమయంలో ఈశ్వర్(పీసీ నెం.5185) నేరాల బాట పట్టాడు. కొద్ది రోజుల క్రితం నల్లగొండ జిల్లా పోలీసులకు దొరికిపోవడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. దీంతో నగర పోలీస్ కమిషనర్ సదరు కానిస్టేబుల్ను వెంటనే సస్పెండ్ చేశారు. పోలీసు విభాగంలో క్రమశిక్షణతో పనిచేయాలి, అలా కాకుండా అధికారిన్ని దుర్వినియోగం చేస్తే వేటు తప్పదని సీవీ ఆనంద్ హెచ్చరించారు.
మేకల ఈశ్వర్ తీవ్రమైన నేరం చేయడంతో 1991 నిబంధన ప్రకారం సాధారణంగా శాఖాపరమైన విచారణ నిర్వహించడం మంచిది కాదని, విచారణ సమయంలో బాధితులను, సాక్షులను బెదిరించే అవకాశముందన్నారు. అలాగే హైదరాబాద్తో పాటు ఇతర జిల్లాలో మైనర్ పిల్లలతో ముఠాను ఏర్పాటు చేసి నేరపూరిత మనసు కలిగి ఉన్నాడని సీపీ తెలిపారు. అది బాధితులు, సాక్షులపై ప్రభావం చూపుతుందన్నారు. విచారణకు సమయం పట్టే అవకాశాలుండడంతో విచారణ స్వేచ్ఛగా జరిపే వాతావారణం ఉండదని, దీంతో ఈశ్వర్ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నామని సీపీ స్పష్టం చేశారు.
మరో ముగ్గురు ఇన్స్పెక్టర్లపై విచారణ..
ఈశ్వర్ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో ముగ్గురు ఇన్స్పెక్టర్లు చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతూ ఈశ్వర్తో సన్నిహిత సంబంధాలు కొనసాగించినట్లు వెల్లడయిందని సీపీ చెప్పారు. గతంలో షాహినాయథ్గంజ్ పోలీస్స్టేషన్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన (ప్రస్తుతం ఎస్ఆర్ నగర్ పీఎస్) వై.అజయ్కుమార్, గతంలో వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్గా పనిచేసి ప్రస్తుతం నార్త్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న టి.శ్రీనాథ్రెడ్డి, గతంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేసి, ప్రస్తుతం ఎస్ఆర్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సాయి వెంకట్ కిశోర్లు ఈశ్వర్తో సన్నిహిత సంబంధాలు కొనసాగించినట్లు తేలిందన్నారు. ఈ ముగ్గురిపై శాఖాపరమైన విచారణ చేపట్టామన్నారు. సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు.