డ్రగ్స్ ముఠాల మత్తు వదిలిస్తున్నారు పోలీసులు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో డ్రగ్స్ సరఫరా చేసేందుకు యత్నిస్తున్న వారిని ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. ముంబై, రాజస్థాన్ నుంచి వివిధ రూపాల్లో మత్తు పదార్థాలు తీసుకువచ్చేందుకు ప్రయత్నించిన నలుగురితో పాటు.. ముగ్గురు వినియోగదారులను కూడా అరెస్ట్ చేశారు. ఈ వివరాలను రాచకొండ సీపీ మహేశ్భగవత్ మంగళవారం మీడియా సమావేశంలో ప్రకటించారు. ముంబై టు హైదరాబాద్
సిటీబ్యూరో, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : గుంటూరుకు చెందిన సీలం సాయికృష్ణ కుటుంబం 25 ఏండ్ల క్రితం నగరానికి వచ్చి మణికొండ ప్రాంతంలో స్థిరపడింది. బీటెక్ మధ్యలోనే ఆపేసి.. ఫ్రీలాన్స్లో ఆమెరికాలో ఉద్యోగాలు నియమించే పనులు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో డ్రగ్స్కు అలవాటు పడి, ఆర్నెళ్ల క్రితం నైజీరియాకు చెందిన డ్రగ్ విక్రేత చిజోకె ఉచ్చెకువ్వ అలియాస్ పీటర్ను మణికొండలోని ఓయో హోటల్లో కలిశాడు.
స్టూడెంట్ వీసాపై ముంబైకి…
పీటర్ సింథటిక్ డ్రగ్స్ అయిన మెథమెఫటమైన్, కొకైన్ సరఫరా చేస్తుంటాడు. కృష్ణతో పరిచయం అయిన తరువాత అతని సర్కిల్లో పీటర్ ఫేమస్ అయ్యాడు. నైజీరియాలో పదో తరగతి పాసై 2014లో స్టూడెంట్ వీసాపై ముంబైకి వచ్చి అప్టెక్ కంప్యూటర్లో కోర్సులో చేరాడు. 2015లో వీసా గడువు పూర్తి కావడంతో కంప్యూటర్ కోర్సు పూర్తి చేయలేదు. ఆ తర్వాత పుణెలోని ఆఫ్రికన్ కిచెన్లో పనిచేస్తూ 2017లో ముంబైకి చెందిన డ్రగ్స్ విక్రేతలతో పరిచయం పెంచుకున్నాడు. ముంబై నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి పుణెలో విక్రయిస్తుండటంతో అరెస్ట్ చేసిన పోలీసులు.. అతని పాస్పోర్టు సీజ్ చేశారు. ఏడాది తర్వాత బెయిల్పై వచ్చిన పీటర్.. 2018లో ముంబైకి మకాం మార్చి అక్కడి ఆఫ్రికన్ కిచెన్లో పనిచేశాడు. 2020లో ఒకోరో అనే డ్రగ్ ఫ్లెడర్తో పరిచయం ఏర్పడింది. ఒక్కో కన్సైన్మెంట్కు రూ.10 వేలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకొని, తిరిగి డ్రగ్స్ సరఫరా చేయడం ప్రారంభించాడు.
న్యూఇయర్ కోసం హైదరాబాద్కు…
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్కు చెందిన కృష్ణతో పీటర్కు పరిచయం ఏర్పడింది. కొత్త సంవత్సరం వేడుకలు వస్తుండడంతో ముంబై నుంచి హైదరాబాద్కు బస్సులో చేరుకున్న పీటర్.. ఒక్కో గ్రాము మెథమెఫటమైన్కు రూ.8 వేల నుంచి రూ.10 వేలు ధర నిర్ణయించాడు. సోమవారం సాయంత్రం పీటర్, సాయికృష్ణ ఇద్దరు నేరెడ్మెట్లోని ఆర్కేపురం బ్రిడ్జి వద్ద కలుసుకొని డ్రగ్స్ క్రయ విక్రయాల గూర్చి మాట్లాడుతున్నారు. విశ్వసనీయ సమాచారంతో ఎల్బీనగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ సుధాకర్ బృందం, నేరెడ్మెట్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 30 గ్రాముల మెథమెఫటమైన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ విలేకరుల సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ రక్షిత కె.మూర్తి, ఎస్ఓటీ డీసీపీ మురళీధర్, నేరెడ్మెట్ ఇన్స్పెక్టర్ నర్సింహస్వామి పాల్గొన్నారు.