సిటీబ్యూరో, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): తాను సీబీసీఐడీ అఫీసరునంటూ క్యాబ్లు బుక్ చేసి డబ్బు ఇవ్వకుండా తప్పించుకుంటున్న వ్యక్తిని నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు కథనం ప్రకారం.. మణికొండకు చెందిన గరికపార్తి శ్రీనివాస్ భువనేశ్వర్లో ఒక మ్యాన్ఫ్యాక్చరింగ్ సంస్థలో పని చేస్తున్నాడు. శ్రీనివాస్.. ఈనెల 15న తెల్లాపూర్కు చెందిన సురేశ్ క్యాబ్ను బుక్ చేసుకున్నాడు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో తిరిగి షేక్పేట్లోని ఓయూ కాలనీ వద్ద కారు దిగాడు. తాను సీబీసీఐడీ అధికారినని, డిపార్ట్మెంట్ డబ్బులు ఇస్తుందని నమ్మించి పరారయ్యాడు. దీంతో బాధితుడు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే. గత నెల 29న భానునాయక్కు చెందిన కారును బుక్ చేసి, సీబీసీఐడీ అధికారినైన తాను విధి నిర్వహణలో భాగంగా బెంగళూర్, మైసూర్కు వెళ్లాలని నమ్మించాడు. ఈనెల 2వ తేదీన తిరిగి హైదరాబాద్కు వచ్చాడు. కానీ.. రూ.51 వేలు బిల్లు చెల్లించకుండా డిపార్ట్మెంట్ ఇస్తుందని తప్పించుకుపోయాడు. బాధితుడు ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంగళవారం నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు.. శ్రీనివాస్ను అరెస్ట్ చేసి తదుపరి విచారణ నిమిత్తం ఎస్ఆర్నగర్ పోలీసులకు అప్పగించారు.