ఆర్కేపురం, డిసెంబర్ 20 : విద్యార్థులందరూ నా బిడ్డలేనని.. వారికీ అన్ని వసతులు కల్పిస్తామని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం సరూర్నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన మంత్రి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కళాశాలలో మౌలిక వసతుల కోసం అక్టోబర్ నెలలోనే రూ.1.46కోట్లు మంజూరు చేయడం జరిగిందని, సాంకేతిక కారణాలతో పనులు చేపట్టడం ఆలస్యమైందని తెలిపారు. రెండు రోజుల్లో 8 బయోటాయిలెట్స్ ఏర్పాటు చేయిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. అదనపు గదులు, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మహేశ్వరం నియోజకవర్గ యూత్వింగ్ అధ్యక్షుడు లోకసాని కొండల్రెడ్డి, నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్, సీనియర్ నాయకులు పారుపల్లి దయాకర్రెడ్డి, రాఘవేంద్రగుప్త, డీసీ హరికృష్ణయ్య, తాసీల్దార్ జయశ్రీ, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.
ఫుట్పాత్ నిర్మించవద్దని మంత్రికి వినతి
కొత్తపేట నుంచి దిల్సుఖ్నగర్ వెళ్లే రహదారిలో ఫుట్పాత్ నిర్మాణ పనులు చేపట్టవద్దని పద్మ వంశీ హ్యాండ్లూమ్స్ వర్తక వ్యాపారస్తులు మంగళవారం పీవీటీ మార్కెట్కు వచ్చిన విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డికి నివేదిక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మహేశ్వరం నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్, నియోజకవర్గ యూత్వింగ్ అధ్యక్షుడు లోకసాని కొండల్రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు మహేందర్యాదవ్, అశోక్, దయాకర్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.
టీయూడబ్ల్యూజే జిల్లా మహాసభకు రావాలని
పహాడీషరీఫ్, డిసెంబర్ 20 : టీయూడబ్ల్యూజే హెచ్-143 యూనియన్ జిల్లా మహాసభకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకావాలని యూనియన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శేఖర్ సాగర్, ప్రధానకార్యదర్శి గాదం రమేశ్, జిల్లా కమిటీ నాయకుడు బిరుదు చందర్, నియోజకవర్గం అధ్యక్షుడు రాజ్కుమార్, కార్యవర్గ కమిటీ సభ్యులు మంగళవారం మంత్రి నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. మహాసభకు రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు శేఖర్ సాగర్ మాట్లాడుతూ.. ఈనెల 30న కొంగరకలాన్లోని లక్ష్మీదేవమ్మ ఫంక్షన్హాల్లో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు సంబంధించి టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జిల్లా సభ నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం జిల్లా చైర్ పర్సన్ తీగల అనితారెడ్డిని ఆహ్వానించారు.
నేడు మంత్రి రాక…
కందుకూరు, డిసెంబర్ 20 : ఈ నెల 21వ తేది మంత్రి సబితా ఇంద్రారెడ్డి కందుకూరుకు వస్తున్నట్లు జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి తెలిపారు. సాయంత్రం 3గంటలకు మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతన గదుల నిర్మాణం కోసం శంకుస్థాపన, దెబ్బడగూడ. కొత్తూరు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్ధాపన చేస్తారని తెలిపారు. మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
అయ్యప్ప పూజలో..
బడంగ్పేట, డిసెంబర్ 20 : తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిరాలలోని లక్ష్మీనరసింహ స్వామి దేవాలయ ఆవరణలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తుక్కుగూడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షుడు లక్ష్మయ్య, కౌన్సిలర్లు రెడ్డిగల్ల సుమన్, బాధావత్ రవినాయక్, సప్పిడి లావణ్య, బూడిద తేజస్విని శ్రీకాంత్, మార్కెట్ యార్డు డైరెక్టర్ బాట సురేశ్, యూత్ అధ్యక్షుడు సామెల్ రాజు, నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.