కొండాపూర్, డిసెంబర్ 18: మాదాపూర్లోని శిల్పారామంలో కొనసాగుతున్న ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళాలో పలువురు నృత్యకారులు తమ ప్రదర్శనలతో ఆద్యంతం ఆకట్టుకున్నారు. వివిధ రాష్ర్టాల నుంచి విచ్చేసిన కళాకారులు తమ ప్రాంతీయ జానపద నృత్య ప్రదర్శనలతో అలరించారు. ప్రదర్శనల్లో భాగంగా దెబోప్రియ బృందం కథక్ నృత్య ప్రదర్శన, పేరిణి శ్రీనివాస్ రావు శిష్య బృందం ఆంధ్రనాట్యం, లూయిటపోరియా అస్సామీ హైదరాబాద్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అస్సామీ సంప్రదాయ బిహు నృత్యాలు, అస్సామీ పాటలు, అస్సామీ జానపద నృత్యాలు, గుజరాత్ రాష్ట్రం నుంచి విచ్చేసిన కళాకారులు తమ ప్రాంతీయ నృత్య ప్రదర్శనలతో అలరించారు. వారాంతపు సెలవుదినం కావడంతో సందర్శకులు కుటుంబ సమేతంగా విచ్చేసి సందడి చేసినట్లు శిల్పారామం నిర్వాహకులు తెలిపారు. మేళా కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎండ్లబండి, బ్యాటరీ కారు, బోటింగ్లో షికారు చేస్తూ సందడి చేశారు.