జవహర్నగర్, డిసెంబర్ 16: ఉన్నత చదువులు చదివి.. కుటుంబానికి పేరు ప్రఖ్యాతలు తెస్తుందని ఆశించిన కన్నవారి కలలు అడియాశలయ్యాయి. అన్నింటిలో ఫస్ట్ వస్తున్న పదేండ్ల ఇందుకు మరణం కూడా అట్లే వచ్చిందంటూ కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానికులు కంటతడి పెట్టారు. అల్లారు ముద్దుగా పెరిగిన చిన్నారి ఇక లేదని కుటుంబ సభ్యులకు తెలియగానే వారిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. తల్లిదండ్రుల రోదనతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. చిన్నారిని చూసేందుకు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కంటి తడి పెట్టారు. ఈ ఘటన శుక్రవారం జవహర్నగర్ పరిధిలో జరిగింది.
జవహర్నగర్ పరిధిలోని అంబేద్కర్నగర్ కాలనీలో నరేశ్ కుటుంబ నివసిస్తుంది. భార్యాభర్తలిద్దరూ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.
వీరి చిన్న కుమార్తె ఇందు (10) దమ్మాయిగూడలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నది. ఆమెను గురువారం ఉదయం తండ్రి పాఠశాల వద్ద వదిలి, పనులకు వెళ్లిపోయాడు. గ్రౌండ్లో ఆడుకుంటానని స్నేహితులకు చెప్పి క్లాస్ నుంచి బయటకు వెళ్లిన బాలిక తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు జవహర్నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అంబేద్కర్నగర్ చెరువులో చిన్నారి ఇందు మృతదేహం ఉన్నదని గమనించిన పోలీసులు.. మృతదేహాన్ని బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. మిస్సింగ్ నుంచి అనుమానాస్పద మృతిగా కేసును మార్చాం.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం.. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ముందుకెళ్తామని ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.
చదువుల్లో ఫస్ట్..
దమ్మాయిగూడలోని ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న ఇందు చిన్నప్పటి నుంచి చదువుల్లో చురుకుగా ఉండేదని, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రత్యేక ప్రతిభ కనబర్చేదని ఉపాధ్యాయులు చెప్పారు. ఇంతలోనే ఇందు మరణ వార్త వింటామని అనుకోలేదని పేర్కొన్నారు. ఎంతో కష్టపడి చదివిస్తున్నాం.. ఇంతలోనే ఘోరం జరిగిందని తల్లిదండ్రులు బోరుమని విలపిస్తున్నారు.
ఇది గంజాయి సేవించే వారిపనే..
దమ్మాయిగూడ ప్రధాన చౌరస్తాకు కుటుంబ సభ్యులు, బంధువులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో చేరుకుని నిరసన తెలిపారు. ఇది ముమ్మాటికి గంజాయి సేవించే వారి పనేనని ఆందోళనకు దిగారు. చెరువు పక్కన నిర్మానుష్యంగా ఉండటంతో గంజాయి సేవించే వారికి ఆవాసంగా మారిందన్నారు. నిందితులను వెంటనే పట్టుకొని.. ఇందు కుటుంబానికి న్యాయం చేయాలని బైఠాయించారు. పోస్టుమార్టం అనంతరం అంబేద్కర్నగర్ చౌరస్తాలో ఇందు మృతదేహంతో కుటుంబసభ్యులు, బంధువులు, ప్రజాసంఘాల నాయకులు నిరసనకు దిగారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి శాంతింపజేశారు. ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పికెటింగ్ ఏర్పాటు చేశారు.