మేడ్చల్, డిసెంబర్ 16: సృజనాత్మకతను అలవర్చుకోవాలని, టెక్నాలజీ వినియోగంతో ఉన్నత శిఖరాలు సులభంగా అధిరోహించవచ్చునని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి విద్యార్థులకు సూచించారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలోని సీఎంఆర్ కళాశాల ఆడిటోరియంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న 12వ ఐఏసీసీ (అంతర్జాతీయ అడ్వాన్స్డెడ్ కంప్యూటింగ్ కాన్ఫరెన్స్) శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి, ఎన్బీఏ (నేషనల్ బోర్డు అక్రిడేషన్) చైర్మన్ ప్రొఫెసర్ కేకే అగర్వాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా తర్వాత టెక్నాలజీ వినియోగానికి మరింత ప్రాధాన్యత పెరిగిందని తెలిపారు. దీనిపై పట్టు సాధించిన విద్యార్థులు దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని చెప్పారు.
ఎన్బీఏ చైర్మన్ అగర్వాల్ మాట్లాడుతూ కంప్యూటర్ సైన్స్ అనేది కేవలం కంప్యూటర్ విద్య కాదని, అంతకు మించి అన్నారు. విద్యా, వైద్యం, వ్యవసాయం తదితర ఎన్నో రంగాల అభివృద్ధికి కంప్యూటర్ సైన్స్ ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా అకాడమిక్ అవార్డులను ప్రకటించారు. కంప్యూటింగ్ ప్రోగ్రామ్స్లో ఉత్తమ సంస్థ అవార్డును గుర్గావ్కు చెందిన అంటినో ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, మహారాష్ట్రకు చెందిన శరత్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, ఉత్తమ ఎడ్ సెట్ కంపెనీ అవార్డును రమణ టీఎస్వీ కోడ్ తంత్ర, ఉత్తమ టీచర్ అవార్డును సుధాన్షు గాంగే, దినేశ్కుమార్, ఉత్తమ హెచ్వోడీ అవార్డును పుష్పేందర్ రావు, రచన సబ్లే, కొప్పుల విజయ్కుమార్, ఉత్తమ రీసెర్చ్ అవార్డును మోతెర్ రెజీ, ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డును డాక్టర్ వీఏ నారాయణకు ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో నోయిడా బెన్నెట్ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ స్కూల్ డీన్, ఐఏసీసీ కో చైర్ ప్రొఫెసర్ దీపక్ గార్గ్, ప్రొఫెసర్ సునీత్ కుమార్, సీఎంఆర్ విద్యా సంస్థల కార్యదర్శి చామకూర గోపాల్ రెడ్డి, సభ్యుడు శ్రీశైలం రెడ్డి, సీఎంఆర్ సీఈవో అభినవ్ రెడ్డి, ప్రిన్సిపాల్ వీఏ నారాయణ, ఐఏసీసీ జరల్ కో చైర్ డాక్టర్ విజయ్కుమార్, డైరెక్టర్లు జంగారెడ్డి, రాజిరెడ్డి, ప్రిన్సిపాల్స్ సత్యనారాయణ, ఏఎస్ రెడ్డి, రామారావు, సీఎస్ఈ హెచ్వోఈ శివస్కంద, తదితరులు పాల్గొన్నారు.