మియాపూర్, డిసెంబర్ 16 : జాతీయ రహదారులపై ఉన్న చౌరస్తాలు సుందరీకరణతో ప్రజలను విశేషంగా ఆకట్టుకోనున్నాయి. చూడచక్కని నిర్మాణాలతో మరింత అందాన్ని సంతరించుకునేందుకు సిద్ధం అవుతున్నాయి. చందానగర్ సర్కిల్ పరిధిలోని మియాపూర్ చౌరస్తా సుందరీకరణ పనులు ప్రారంభమయ్యాయి. చౌరస్తా సుందరీకరణలలో భాగంగా శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని మియాపూర్ బొల్లారం పనులను తాజాగా ప్రారంభించారు. విప్ అరెకపూడి గాంధీ సహా జోనల్ అధికారులు తొలుత ఈ చౌరస్తా సుందరీకరణకు ప్రతిపాదించారు. దీంతో పనులు సైతం ఇటీవలే ప్రారంభం కాగా.. ముమ్మరంగా చేపట్టి వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.
కోట్లతో సుందరీకరణ పనులు..
శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ చౌరస్తాను రూ.2 కోట్ల నిధులతో పూర్తి స్థాయిలో సుందరీకరించనున్నారు. నిధులు మంజూరు కాగా.. ఇప్పటికే పనులు సైతం ప్రారంభమయ్యాయి. సుందరీకరణలో భాగంగా కూకట్పల్లి నుంచి మియాపూర్ వైపు చౌరస్తాలో సెంట్రల్ మీడియన్ పనులు ముమ్మరంగా నడుస్తున్నాయి. ఇప్పటికే ఫుట్ ఓవర్ వంతెన కింద వైపు డ్రైనేజీ పైప్లైన్లు, మ్యాన్ హోళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసిన అధికారులు.. రెండు వైపులా ఫుట్పాత్ల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నారు. చౌరస్తాకు మూడు వైపులా ఫుట్ పాత్లు, ట్రాఫిక్ ఐల్యాండ్లు, పచ్చదనం, విశాలమైన అధునాతన బస్ బే.. సిటవుట్ల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. చౌరస్తా విస్తరణకు ఆటంకంగా విద్యుత్ స్తంభాలు ఉండగా వాటిని పక్కకు మార్చాలని ఇప్పటికే విద్యుత్ అధికారులకు లేఖ రాశారు. పాదచారులు సురక్షితంగా చౌరస్తా దాటేందుకు వీలుగా ఏర్పాట్లు సైతం చేపట్టనున్నారు. మియాపూర్ చౌరస్తాలో ఒకటి రెండు నిర్మాణాలను సైతం కొంత మేర తొలగించేందుకు సైతం అధికారులు చర్యలకు సిద్ధం అవుతున్నారు. పచ్చదనంతో పాటు ఆహ్లాదకరమైన ఐల్యాండ్లను ఏర్పాటు చేయనున్నారు.