సిటీబ్యూరో, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : చారిత్రక, ఆధునిక మేళవింపుతో విశ్వపథాన పయనిస్తూ.. అంతర్జాతీయ నగరాలతో పోటీపడుతున్న హైదరాబాద్లో మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. ప్రతిష్టాత్మకమైన ఎయిర్పోర్టు మెట్రోకు పునాదిరాయి పడింది. 31 కి.మీ దూరంతో రూ. 6,250 కోట్లతో చేపట్టనున్న రాయదుర్గం-శంషాబాద్ ఎయిర్పోర్టు ఎక్స్ప్రెస్ మెట్రో ప్రాజెక్టుకు శుక్రవారం మైండ్స్పేస్ వద్ద సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం పోలీస్ అకాడమీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. భవిష్యత్లో రింగ్ రోడ్డు చుట్టూ మెట్రోను విస్తరిస్తామని ప్రకటించారు. వరల్డ్ గ్రీన్ సిటీతోపాటు, బెస్ట్ లివబుల్ సిటీ అవార్డులను హైదరాబాద్ దక్కించుకోవడం గర్వకారణంగా ఉందని, ఇంకా ఎన్నెన్నో అవార్డులు నగరానికి రావాలని ఆకాంక్షించారు.
హైదరాబాద్ మహా నగరం విశ్వనగరంగా పురోగమిస్తున్నది. ప్రస్తుత అవసరాలే కాకుండా.. భవిష్యత్తు అవసరాలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నది. ముఖ్యంగా ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న పరిశ్రమలను బయటికి తరలించడం ద్వారా ఓఆర్ఆర్ బయట కొత్తగా వెలుస్తున్న పారిశ్రామిక వాడలు సరికొత్త విప్లవానికి నాంది పలుకుతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు.
ఉపాధికి బాటలు.!
ఓఆర్ఆర్ అవతల రోజురోజుకూ విస్తరిస్తున్న పారిశ్రామిక వాడలతో ఆయా ఉత్పత్తులు ఘననీయంగా పెరుగుతున్నాయి. యువతకు ఉపాధి అవకాశాలు సైతం పుష్కలంగా లభిస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు సైతం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా ఓఆర్ఆర్ సమీపంలోనే వెలుస్తున్న ఫార్మా సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, మెడికల్ డివైజెస్ పార్కు, జినోమ్ వాల్యూ, ఐటీ హబ్, ఐటీ కారిడార్లు, తదితర పారిశ్రమల ఏర్పాటుతో నగరం మరింత విస్తరిస్తున్నది. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఆయా రంగాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి.
గచ్చిబౌలి నుంచే మొదలు
రాయదుర్గం నుంచి మొదలయ్యే మెట్రో మార్గం మొదట ఓఆర్ఆర్ వెంబడి శంషాబాద్ వరకు నిర్మిస్తున్నారు. భవిష్యత్తులోనూ ఔటర్ రింగురోడ్డు వెంబడి లోపలి వైపు రైల్వే కారిడార్ కోసం సేకరించిన స్థలంలోనే మెట్రో కారిడార్ రింగును నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. భవిష్యత్తులో 158 కి.మీ పొడవునా ఉన్న ఓఆర్ఆర్ చుట్టూ సైతం మెట్రో కారిడార్ నిర్మించనున్నట్లు తెలుస్తున్నది.
నిమిషాల్లో ఎయిర్ పోర్టుకు
హైదరాబాద్ నుంచి ఎయిర్పోర్టుకు వచ్చే వారితో పాటు వివిధ పనుల నిమిత్తం నగరానికి వెళ్లే ప్రజలకు ప్రయాణం మరింత సులభంగా మారనున్నది. నగరంలో మెట్రో రైలుతో ట్రాఫిక్ సమస్యలు తీరాయి. రానున్న రోజుల్లో ఎయిర్పోర్టుకు నిమిషాల్లో చేరుకోవచ్చు.
– సుష్మారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్, శంషాబాద్
మారనున్న శంషాబాద్ రూపురేఖలు
మెట్రో రైలు మార్గం రాకతో శంషాబాద్ రూపురేఖలు మారనున్నాయి. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మణికొండ, నార్సింగి, బండ్లగూడతో పాటు శంషాబాద్లో నివాస గృహాలతో పాటు ఇక్కడ అనేక వసతులు రానున్నాయి.
– గోపాల్యాదవ్, వైస్ చైర్మన్, శంషాబాద్
అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ..!
సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెల్లోనే కాదు., దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే నాయకుడు. అసాధ్యం అనుకున్న వాటిని కూడ సుసాధ్యం చేసే గొప్ప పాలకుడు. శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో రైలు మార్గాన్ని పెంచడం సంతోషంగా ఉన్నది.
– జయమ్మ, ఎంపీపీ శంషాబాద్
మరింత విస్తరణకు అనుకూలం
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి హైదరాబాద్ నగరం దినదినం అభివృద్ధి చెందుతున్నది. దీంతో నగర శివారు ప్రాం తాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పుడు మెట్రో రైలు వస్తుండటంతో బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జనాభా పెరిగి మరింత విస్తరించనున్నది.
–మహేందర్గౌడ్, మేయర్, బండ్లగూడ జాగీర్
రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది
ఔటర్ రింగ్రోడ్డు మీదుగా మెట్రో రైలు ప్రారంభిస్తే రవాణా వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇప్పటికే నగరంలో చేపట్టిన రోడ్లు, వంతెనలతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధితో నగరం రోజురోజుకు విస్తరిస్తున్నది.
– పద్మావతి పాపయ్య యాదవ్, కార్పొరేటర్.
ట్రాఫిక్ సమస్యలను అధిగమించవచ్చు
మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ట్రాఫిక్ సమస్య, సమయం రెండూ ఆదా అవుతున్నాయి. ఐటీ కారిడార్ నుంచి ఉప్పల్ ప్రాంతానికి చేరుకోవాలంటే గంటల పాటు ట్రాఫిక్లో ఇరుక్కొని ఇబ్బందులు పడేది. ప్రస్తుతం మెట్రో సేవలు అందుబాటులోకి రావడంతో సమయానికి చేరుకుంటున్నాం. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు సేవలు ప్రారంభమైతే క్షణాల్లోనే చేరుకోవచ్చు.
– బాలకిరణ్, సాఫ్ట్వేర్