సిటీబ్యూరో, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ ) : అంతర్జాతీయ నగరాలతో పోటీ పడుతున్న హైదరాబాద్లో మరో భారీ ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విశ్వనగరంగా మారిన హైదరాబాద్ భవిష్యత్ అవసరాల దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాయదుర్గం మైండ్స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు రూ.6,250 కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో కారిడార్ 2.0 నిర్మాణానికి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు శుక్రవారం ఉదయం 11.23 గంటలకు శంకుస్థాపన చేశారు. అనంతరం రుత్వికుల వేద మంత్రోచ్ఛరణల నడుమ పూర్ణకుంభ స్వాగతంతో వేదికపైన చండీమాత వద్ద సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, మహమూద్ ఆలీ, వేముల ప్రశాంత్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితాఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎంపీలు కే.కేశవరావు, నామా నాగేశ్వర్రావు, రంజిత్రెడ్డి, ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, కేపీ వివేకానంద్, సాయన్న, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, బేతి సుభాష్రెడ్డి, పైలెట్ రోహిత్రెడ్డి, జైపాల్యాదవ్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, శంభీపూర్ రాజు, కె.నవీన్కుమార్, పట్నం మహేందర్రెడ్డి, కె.జనార్దన్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్, జీఎంఆర్ గ్రూపు చైర్మన్ జీఎం రావు, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సీఎంవో అధికారులు భూపాల్రెడ్డి, దేశ్పతి శ్రీనివాస్, కార్పొరేషన్ల చైర్మన్లు గ్యాదరి బాలమల్లు, రావుల శ్రీధర్రెడ్డి, ఉప్పల శ్రీనివాస్ గుప్తా, అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, కేఎస్ రత్నం, బీసీ కమిషన్ సభ్యులు కిశోర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
భారీ శిలాఫలకం
మైండ్స్పేస్ వద్ద ‘హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో లిమిటెడ్’ పేరిట భారీ శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. కాగా శంకుస్థాపన కార్యక్రమానికి భారీ ఎత్తున తరలివచ్చిన టీఆర్ఎస్ శ్రేణులు సీఎం కేసీఆర్ బస్సు దిగిన వెంటనే నినాదాలతో హోరెత్తించారు. దేశ్ కీ నేత, జై బీఆర్ఎస్ అంటూ స్లోగన్స్ మిన్నంటాయి.
తెలంగాణకు వెల్లువలా పెట్టుబడులు
సీఎం కేసీఆర్ దూరదృష్టి, ఆయన చేసిన అభివృద్ధి వల్ల రాష్ర్టానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిన తరుణంలో సీఎం తొలిసారి రంగారెడ్డి జిల్లాకు రావడం మా అదృష్టం. మెట్రో ఫేజ్-2 వల్ల హైదరాబాద్, రంగారెడ్డి చుట్టుపక్కల అందరికీ ఎంతో మేలు జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా నలుమూలల ఎన్నో కొత్త కంపెనీలు, పెద్ద సంస్థలు, పారిశ్రామిక కాలనీలు ఆవిర్భవిస్తున్నాయి. రవాణా పరంగా ఆయా కంపెనీలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ముఖ్యమంత్రి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఒక విజన్తో పని చేస్తున్న సీఎం కేసీఆర్. ఆయన ఆలోచనా విధానం వల్లే రాష్ట్రం ఇత పురోభివృద్ధి సాధించింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వల్ల లింకు రోడ్లు, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్లు నిర్మించి నగరంతో పాటు శివారు ప్రాంతాలను కూడా ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేస్తున్నారు. దేశంలోని మిగతా నగరాలకు హైదరాబాద్ ఆదర్శంగా నిలుస్తున్నది.
హైదరాబాద్కు మెట్రో మణిహారం
‘హైదరాబాద్ ఓ పవర్ ఐల్యాండ్. చరిత్ర చెబుతున్న సత్యమిది. దేశంలోని ఎన్నో నగరాల కంటే ముందుగా మన సిటీకి విద్యుత్ వచ్చింది. అన్ని వర్గాలు, కులాలు, మతాలు, ప్రాంతాలు, జాతులను అక్కున చేర్చుకొని అద్భుతమైన కాస్మోపాలిటన్ సిటీగా ఆవిర్భవించింది. భూంకపాలు రాకుండా, భూగోళం మీదనే సేఫేస్ట్గా ఉండే నగరం మనది. చరిత్ర, వర్తమానమే కాదు హైదరాబాద్ భవిష్యత్ కూడా ఎంతో గొప్పగా ఉండబోతున్నది. నీళ్ల గోస, కరెంటు బాధలు లేకుండా చేసుకున్నాం. రవాణా వ్యవస్థను ఆధునీకరించి ట్రాఫిక్ కష్టాలు లేకుండా చేసుకుంటున్నాం. మెట్రోను నలుదిశలా విస్తరించుకుంటున్నాం. ఈరోజు మైండ్స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు 31 కిలోమీటర్ల మెట్రో పనులకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో హైదరాబాద్ ఓఆర్ఆర్ చుట్టూ మెట్రోను విస్తరిస్తాం. ఇప్పటికే విశ్వనగరంగా ఉన్న హైదరాబాద్కు మరింత గుర్తింపు తీసుకువస్తాం.’
న్యూయార్క్, లండన్, ప్యారిస్లో కరెంట్ పోవచ్చు కానీ.. హైదరాబాద్లో పోదు. నగరాన్ని పవర్ ఐలాండ్గా మార్చాం. దేశంలోని ఇతర నగరాల కంటే ముందుగా 1912లోనే విద్యుత్ వచ్చిన నగరం హైదరాబాద్. క్షణం పాటు కూడా కరెంటు పోని పరిస్థితిని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే తీసుకొచ్చాం. నిరంతరాయంగా 24 గంటల పాటు అన్ని రంగాలకు విద్యుత్ను సరఫరా చేస్తున్నాం. చరిత్రలో నిజమైన కాస్మోపాలిటన్ సిటీ హైదరాబాదే.. అన్ని వర్గాలు, కులాలు, ప్రాంతాలు, జాతులను అక్కున చేర్చుకొని విశ్వనగరంగా మారింది.
–సీఎం కేసీఆర్