సిటీబ్యూరో, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ ) :కారు చీకట్లు కమ్ముకున్నప్పుడు చిరు దివ్వె కూడా దేదీప్యమానమై విరాజిల్లుతుంది. చీకటి నిండిన బతుకులకు దారిచూపుతుంది. అసమర్థ పాలకుల చేతిలో కునారిల్లుతున్న దేశానికి దారిచూపే చిరు దివ్వెలా ఆవిర్భవించింది భారత రాష్ట్ర సమితి. దేశంలోని అసమానతల కారు చీకట్లను తరిమి వేసేందుకు కోటి సూర్య ప్రకాశకుడిలా మారాడు చంద్రశేఖరుడు. తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే అభివృద్ధికి రోల్ మాడల్గా మార్చారు. ఒకనాడు కరువు కాటకాలతో అల్లాడిన ప్రాంతాల్లో సిరులు పండేలా చేసిన ఉద్యమ వీరుడు.. మరో అడుగు ముందుకు వేశారు. అద్భుతమైన జలవనరులు, సాగు భూమి, సమ శీతోష్ణ వాతారవణం కలిగిన భారతదేశాన్ని అతిపెద్ద ఫుడ్ చైన్ దేశంగా మార్చేందుకు నడుం బిగించారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో భారత రాష్ట్ర సమితి ప్రస్థానాన్ని ప్రారంభించారు. రత్నగర్భ అయిన మన దేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో నిలిపేందుకు ఆర్థిక, పర్యావరణ, మహిళా సాధికారత, జల, రైతు విధానాలను రూపొందిస్తామని ప్రకటించిసరికొత్త మార్పునకు నాంది పలికారు.
‘కరోనా క్లిష్ట సమయంలో దేశమంతా ఆర్థికంగా వెనుకకు పోయినా.. తెలంగాణ రాష్ట్రం మాత్రం ఆర్థిక క్రమశిక్షణ, నియంత్రణతో నిలదొక్కుకున్నది. చిన్న రాష్ట్రం అని అవహేళన చేసిన వారే ఇప్పుడు తెలంగాణను చూసి ముక్కున వేలేసుకునే పరిస్థితి తీసుకువచ్చాం. అదే రీతిలో దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావాల్సిన బాధ్యత ఇప్పుడు భారత రాష్ట్ర సమితిపై ఉన్నది. కర్నాటక ఎన్నికలతో మన జాతీయ పార్టీ ప్రస్థానాన్ని ప్రారంభిద్దాం. కేంద్రంలో రాబోయేది రైతు ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గ విధానాలకు వ్యతిరేకంగా, నూతన విధానాలను అమల్లోకి తెద్దాం. అద్భుతమైన యువ
సంపత్తిని నిర్వీర్యం చేస్తున్నారు. యువతను మతోన్మాదులుగా మారుస్తున్నారు. దీన్ని నిలువరించాల్సిన అవసరం ఉన్నది. ఇది బీఆర్ఎస్ నుంచే ప్రారంభం కావాలె. 60 లక్షలున్న మన టీఆర్ఎస్ కుటుంబ సభ్యులంతా దీనికి నడుం బిగించాలి.’
‘కాలుష్య రహితమైన ఏకైక రవాణా సదుపాయం మెట్రో. దీన్ని మరింతగా విస్తరించాల్సిన అవసరమున్నది. అందుకే హైదరాబాద్ చుట్టూ మెట్రో రైలు వలయం ఏర్పాటు చేస్తాం. ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా గ్రేటర్ చుట్టూ మెట్రో సేవలను విస్తరిస్తాం. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే ఎయిర్ పోర్టుకు మెట్రో కనెక్టివిటీ రాలేదు. ఈ లోపాన్ని తీర్చేందుకే రూ.6.500 కోట్లతో రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో నిర్మాణం చేపడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా ఈ ఎక్స్ప్రెస్ మెట్రో ప్రాజెక్టును మూడేండ్లలో విజయవంతంగా పూర్తి చేస్తాం.’
భావి ప్రధాని కేసీఆరే
స్వరాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ద్వారా ఉద్యమం చేసి తెలంగాణను సాధించారు. ఇప్పుడు బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ దేశ గతిని మార్చనున్నారు. భారత దేశానికి భావి ప్రధాని మీరే అవుతారు. అందు కోసం మేమంతా మీ వెంటే ఉంటాం. తెలంగాణ రాష్ట్రం రాక ముందు, వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి తీరును రాష్ట్ర ప్రజలే కాకుండా పొరుగు రాష్ర్టాల వాళ్లు సైతం పొడుగుతున్నారు. రాష్ట్రం కోసం, మా జిల్లా కోసం, మా నియోజకవర్గ ప్రజల బాగోగుల కోసం ముఖ్యమంత్రి చేస్తున్న కృషి అభినందనీయం.
– ప్రకాశ్గౌడ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే