బన్సీలాల్పేట్, డిసెంబర్ 9 : మత్తు పదార్థాల వినియోగం వలన విద్యార్థుల జీవితాలు చిత్తు అవుతున్నాయని వాటికి దూరంగా ఉండి యువత తమ ఉజ్వలమైన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని నార్త్ జోన్ పరిధిలోని చిలకలగూడ పోలీసులు సూచించారు. శుక్రవారం పద్మారావునగర్లోని సర్దార్ పటేల్ కళాశాలలో యాంటి డ్రగ్స్ కమిటీ, చిలకలగూడ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో డ్రగ్స్ వాడకం వలన కలిగే అనర్థాలపై అవగాహన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని, చదువుకోవడానికి తమ పిల్లలను కళాశాలకు పంపిస్తారని, అలాంటి చోట వారికి డ్రగ్స్కు అలవాటు కావడం, వాటిని ప్రోత్సహించడం లాంటివి జరగడం మంచిది కాదన్నారు. ప్రతి కాలేజీలో ‘యాంటి డ్రగ్స్ కమిటీ’ లను ఏర్పాటు చేశామని, ర్యాగింగ్ లాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ఎవరైన డ్రగ్స్ విక్రయించిన, వాడకానికి ప్రేరేపించిన వెంటనే 100 నంబర్కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని వారు సూచించారు. చిలకలగూడ పీఎస్ ఎస్ఐలు కిశోర్, రవి, పవన్ రెడ్డి, వెంకటేశ్, సాయిరామ్, దీపక్లు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలత, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అమర్నాథ్ శర్మ, యాంటి డ్రగ్స్ కమిటీ కన్వీనర్ ఇంద్రాణి పాల్గొన్నారు.