ముషీరాబాద్, డిసెంబర్ 9: భారత ఆర్థిక వ్యవస్థను అగ్రభాగాన నిలబెట్టిన ఎల్ఐసీ సంస్థను కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం.. కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్నదని ఎల్ఐసీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీఏఓఐ) మండిపడింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏ)డ్రాఫ్ట్ను ఉప సంహరించుకోవాలని, లేని పక్షంలో దేశ వ్యాప్తంగా ఐక్యపోరాటాలు చేస్తామని హెచ్చరించారు. శుక్రవారం ఇందిరాపార్కు ధర్నా చౌక్లో ఇన్సూరెన్స్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏ)డ్రాఫ్ట్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఎల్ఐసీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీఏఓఐ) ఆధ్వర్యంలో 19 రాష్ర్టాల ఎల్ఐసీ ఏజెంట్స్ మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎల్ఐసీఏఓఐ జాతీయ ప్రధాన కార్యదర్శి పీజీ దిలీప్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏ)డ్రాఫ్ట్ను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. డ్రాఫ్ట్తో ఎల్ఐసీ ఏజెంట్ల వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నదన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసీ ఏఓఐ సౌత్ జోన్ అధ్యక్షుడు ఎల్.మంజునాథ్, ప్రధాన కార్యదర్శి పిఎల్.నరసింహారావు, మాజీ ఎంపీ వాసుదేవ్ ఆచార్య, శ్రీకాంత్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.