సిటీబ్యూరో, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం టీఎస్ఆర్టీసీ సన్నాహాలు చేస్తున్నది. పండుగను పురస్కరించుకుని 4,233 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. 585 సర్వీస్లకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. వచ్చే ఏడాది జనవరి 7 నుంచి 15వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులను నడపనున్నారు. సంక్రాంతికి ప్రత్యేక బస్సుల ఏర్పాటు, ఇతర అంశాలపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హైదరాబాద్ బస్భవన్ నుంచి శుక్రవారం ఉన్నతాధికారులు, ఆర్ఎంలు, డీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసారి గతేడాది కన్నా 10 శాతం అదనపు బస్సులను నడుపుతున్నామని సజ్జనార్ తెలిపారు. ఈసారి ఆంధ్రప్రదేశ్లోని అమలాపురం 125 బస్సులు, కాకినాడకు 117, కందుకూరుకు 83, విశాఖపట్నానికి 65, పోలవరంకు 51, రాజమండ్రికి 40 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించినట్లు పేరొన్నారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలన్నారు.
60 రోజుల పాటు అడ్వాన్స్ బుకింగ్
సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం అడ్వాన్స్ టికెట్ బుకింగ్లను 30 రోజుల నుంచి 60 రోజులకు పెంచినట్లు సజ్జనార్ తెలిపారు. వచ్చే ఏడాది జూన్ వరకు అడ్వాన్స్ బుకింగ్ సదుపాయం 60 రోజుల వరకు అందుబాటులో ఉంటుందని ఆయన చెప్పారు. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు.
ట్రావెల్ యాజ్ యూ లైక్ టికెట్ ధర రూ.60 కే..
బస్సు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ అధికారులు అనేక చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల కోసం ట్రావెల్ యాజ్ యు లైక్ (టీఏవైఎల్) టికెట్ ధరను రూ.100 నుంచి రూ.60కి తగ్గించినట్లు శుక్రవారం ఆర్టీసీ గ్రేటర్ ఈడీ యాదగిరి తెలిపారు. ఆర్టీసీ బస్సులలో 24 గంటలు ప్రయాణించే వారి సదుపాయం కోసం రూ.40 తగ్గిస్తూ ఆర్టీసీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే పెద్దలకు మాత్రం యధావిధిగా రూ.100 టికెట్ ఉంటుందన్నారు.
మూడు అదనపు బస్సులు..
సికింద్రాబాద్ నుంచి బహుదూర్పల్లి మార్గంలో ప్రయాణికుల రద్దీని ఆర్టీసీ అధికారులు గుర్తించారు. దీంతో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బహుదూర్పల్లి రూట్ నంబర్ 227లో మూడు అదనపు బస్సులు ఏర్పాటు చేసినట్లు సికింద్రాబాద్ ప్రాంతీయ అధికారి సీహెచ్ వెంకన్న తెలిపారు.