బంజారాహిల్స్,డిసెంబర్ 9: గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు దూరవిద్యను అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన డా.బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలో అనేక యూనివర్సిటీల ఏర్పాటుకు మార్గదర్శిగా నిలిచిందని న్యాక్ మాజీ డైరెక్టర్, యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్లర్ ప్రొ.వీఎస్.ప్రసాద్ అన్నారు. దూరవిద్యా పితామహుడు ప్రొ. జి.రాంరెడ్డి జయంతిని పురస్కరించుకుని గురువారం జూబ్లీహిల్స్లోని డా.బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ‘నాలుగు దశాబ్దాల భారత దేశపు మొదటి ఓపెన్ యూనివర్సిటీ- గత అనుభవాలు, భవిష్యత్ ప్రయాణం’ అనే అంశంపై ప్రొ. వీఎస్.ప్రసాద్ స్మారక ఉపన్యాసం చేశారు. దేశంలో దూరవిద్య విధానాన్ని ప్రారంభించే క్రమంలో వచ్చిన ఇబ్బందులను ప్రొ.రాంరెడ్డి దీటుగా ఎదుర్కొని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటినీ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో విద్యార్థులకు ఉపయోగపడే కోర్సులను రూపకల్పన చేయాలని, మరింత నాణ్యమైన ఉన్నత విద్యను పేద విద్యార్థులకు అందించాల్సిన అవసంర ఉందన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొ.కే సీతారామారావు, అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. ఘంటా చక్రపాణి. ప్రొ.జి.రాంరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ కార్యదర్శి ప్రొ.జి.హరగోపాల్, ప్రొ.రాంరెడ్డి సతీమణి ప్రమీలా రాంరెడ్డి, ప్రొ.సుధారాణి, ప్రొ.మధుసూధన్రెడ్డి, ప్రొ. ఆనంద్ పవార్, వడ్డాణం శ్రీనివాస్ పాల్గొన్నారు.